మాజీ మావోయిస్టు నేతను నరికి చంపారు
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో మాజీ మావోయిస్టు జిల్లా కార్యదర్శి గుణగంటి శ్యామ్ అలియాస్ యాదయ్యగౌడ్(36) ఆదివారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు వేట కొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలతో దారుణంగా నరకడంతో తీవ్ర రక్తస్త్రావంతో గుణగంటి శ్యామ్ కుప్పకూలిపోయాడు.
సంఘటన స్థలంలో భార్య గుణగంటి శోభ అలియాస్ కృష్ణమ్మ, కుమారులు రాకేష్, కార్తీక్లకు స్వల్ప గాయాలయ్యాయి. వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన శ్యామ్ అలియాస్ యాదయ్యగౌడ్ తన గ్రామం నుంచి భార్య, పిల్లలతో ద్విచక్ర వాహనంపై వెల్దండ వైపు వస్తుండగా గుర్తుతెలియని దుండగులు పథకం ప్రకారం వెల్దండకు మూడు కిలోమీటర్ల దూరంలో తెల్ల కారులో వెనక నుంచి వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు.
శోభ కథనం ప్రకారం - కిందపడిపోయిన శ్యామ్ను వేట కొడవళ్లు, గొడ్డలతో విచక్షణరహితంగా తల, మెడ భాగంలో బలంగా నరికారు. భార్య, పిల్లలు వేడుకున్నా దుండగులు కనికరించకుండా దారుణంగా నరికి పరారీ అయినట్లు భార్య తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్తమడుగులో కొన ఊరిపితో ఉన్న శ్యామ్ను చికిత్స నిమిత్తం ఆటోలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుణగంటి యాదయ్యగౌడ్ అలియాస్ శ్యామ్ మృతి చెందాడు.
పోలీసులపై మండిపడ్డ శ్యామ్ భార్య
ఎన్నోసార్లు తన భర్తకు ప్రాణహాని ఉందని మొత్తుకున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ దారుణ హత్యకు గురైన మాజీ మావోయిస్టు జిల్లా కార్యదర్శి గుణగంటి యాదయ్యగౌడ్ అలియాస్ శ్యామ్ భార్య గుణగంటి శోభ అలియాస్ కృష్ణమ్మ తీవ్ర స్థాయిలో మండిపడింది. పోలీసులు చెబితేనే పిల్లాజెల్లాలతో కల్వకుర్తికి వచ్చి బతుకుతున్నామని, నా భర్త ఎవరి జోలికి పోలేదని, మా సొమ్మును తిన్నొళ్లే మా భర్తను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించింది.