ఎనిమిదో వింత: కేసీఆర్పై పొన్నాల, 'ఉద్యోగాలెక్కడ'
హైదరాబాద్: తాను చేసేదే చెబుతానని, అబద్దాలు చెప్పనని వ్యాఖ్యానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య బుధవారం కౌంటర్ ఇచ్చారు. తాను అబద్దాలు చెప్పనని కేసీఆర్ చెప్పడమే పచ్చి అబద్దమని, అది ప్రపంచంలో ఎనిమిదో వింత అని పొన్నాల ఎద్దేవా చేశారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, తెలంగాణ వచ్చిన తర్వాత పదవి వద్దు.. కాపలా కుక్కలా ఉంటానని, అవసరమైతే తల నరుక్కుంటానని, మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని ప్రగల్బాలు పలికిన కేసీఆర్.. నేడు అబద్దాలు చెప్పనననడం ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నారు. వంద రోజులైనా ఇంకా పనులు మొదలు పెట్టలేదని సీఎం మాట్లాడటం సరికాదన్నారు.
ఎన్నో ఆశలతో ప్రజలు ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేస్తే సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. సీఎం పదవి హానీమూన్ కోసమా అని ప్రశ్నించారు. జూన్ 2నే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీగా కావాలని పట్టుబట్టలేదా, సీఎం కుర్చీ కోసం తహతహలాడలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ పైన వ్యతిరేక వైఖరి కొనసాగితే పది కిలోమీటర్ల లోపల పాతరేస్తానంటూ కేసీఆర్ మాట్లాడటం దొర అహంకారానికి నిదర్శనమన్నారు.
కేసీఆర్ను ఏకిపారేసిన టీడీపీ
కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారని తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎల్ రమణ విమర్శించారు. మెదక్ జిల్లాలో టిడిపి-బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డికి ఓటు వేస్తే ఆంధ్ర వాళ్ళకు వేసినట్లే అవుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పడాన్ని రమణ మంగళవారం విలేఖరుల సమావేశంలో ఖండించారు. ఇది తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టించడమే అవుతుందన్నారు. కేసీఆర్కు తెలుగు దేశం పార్టీ రాజకీయ బిక్ష పెట్టిందన్నారు.
తెలుగు దేశం అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2008లో, 2012లో తమ పార్టీ కేంద్రానికి లేఖ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న తెరాస ఏమి సాధించిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఎంతమంది నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని, వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన కెసిఆర్ కనీసం జాబితానైనా సిద్ధం చేశారా? అని రేవంత్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకున్న పోలీసు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలు 45 రోజుల పాటు సకల జనుల సమ్మె చేశారన్నారు. రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత భత్యాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్ళకు పెంచితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవడం లేదన్నారు.