కెసిఆర్ అక్కడ, ర్యాంప్ షోలో కెటిఆర్: నర్సిరెడ్డి
హైదరాబాద్: మెట్రో లెవల్ పార్కింగ్కు చెందిన స్థలాలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన బంధువు మైహోంకు చెందిన రామేశ్వరరావుకు కట్టబెట్టాడని ఆధారాలతో తమ పార్టీ బయటపెట్టి బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తే ఎందుకు రావడం లేదని తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు.
రాజకీయ అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులనైనా వదలనన్న కెసిఆర్ రూ. 2వేల కోట్ల ఆస్తిని తన బంధువుకు ఇచ్చిన విషయంపై ఎందుకు స్పందించడం లేదని అడిగారు. కేసీఆర్ను, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ని బహిరంగ చర్చకు రావాలంటే చెప్పులు మోసేటోళ్ళు, చెక్క భజన చేసోటోళ్ళు, లట్టుగాడు, పిట్టుగాడు ఎదురుదాడి చేస్తున్నారని ఆయన తప్పు పట్టారు.
ప్రమాణ స్వీకార పత్రం కూడా చదవరాని పనికి మాలిన ప్రతివాడు చర్చకు సిద్ధమని మాట్లాడుతున్నారు. సింహంలా సింగిల్గా చర్చకు మేం వస్తామంటే, పందుల మందగా వందల కొద్దీ టీఆర్ఎస్ నేతలు చర్చకు వస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ పైలెట్ కేసీఆర్ ఫామ్హోస్లో ఉంటే, కో-పైలెట్ కేటీఆర్ ఎక్కడ ఉండు? ర్యాంప్ షోలలో ఉన్నాడా? పార్క్ హయత్ వంటి స్టార్ హోటల్స్లో తెలంగాణ అభివృద్ధి గురించి సెలబ్రిటీలతో లోతుగా చర్చిస్తున్నాడా? అని ఆయన ప్రశ్నించారు.
హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి జాతరలో పోతురాజు లెక్క అని, తూటాలు లేని తూపాకీ అని, వాచ్మెన్కు ఎక్కువా హోంగార్డుకి తక్కువని విమర్శించారు. నాయిని నర్సింహా రెడ్డి కల్లు కాంపౌండ్లో కౌంటర్ల మీద కూర్చోడానికి పనికొస్తాడని, కేసీఆర్ కేబినెట్లో మొదటి డమ్మీ నాయిని నర్సింహారెడ్డే అని విమర్శించారు.