కళాకారులకు కేసీఆర్ కొత్త స్కీం, ఉద్యోగాలు (ఫోటో)
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి అనే పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలను అట్టడుగుస్థాయి వరకు, గ్రామగ్రామానికి చేరవేసే విధంగా ఈ పథకం పని చేస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు.
గోరేటి వెంకన్న, జయరాజ్, మిట్టపల్లి సురేందర్, యశ్పాల్, దేశపతి శ్రీనివాస్, వరంగల్ శ్రీనివాస్, మార్త రవి తదితరులతో కేసీఆర్ సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. ఉద్యమకాలంలో వందలాది మంది తెలంగాణ కళాకారులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం వనరులు, వసతులు ఉన్నా లేకపోయినా పని చేశారని కేసీఆర్ అన్నారు.
వారందరినీ తెలంగాణ అభివృద్ధి ఉద్యమంలో భాగస్వాములను చేయాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. దాదాపు 500 మంది కళాకారులకు ఉద్యోగావకాశం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఇందుకోసం నిబంధనలను సడలించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కళాబృందాలుగా పని చేసిన వేలాదిమందికి సముచిత పారితోషికాన్ని అందిస్తూ, ఉపాధి కల్పించే దిశలో ప్రభుత్వం ఉన్నట్లు కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులకు, కళాకారులకు సముచిత గౌరవాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.