బిజీబిజీ: సింగపూర్లో కేసీఆర్కు శఠగోపం! (పిక్చర్స్)
హైదరాబాద్: సింగపూర్ పర్యటనలో తొలి రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిజీబిజీగా గడిపారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లిన కేసీఆర్ బుధవారం ఉదయం ఆరు గంటలకు సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్లోని రిట్జ్ కార్జన్ హోటల్ వద్ద కేసీఆర్కు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.
22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సు జరిగే స్టేడియాన్ని ఉదయం 11 గంటలకు కేసీఆర్ పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం సింగపూర్లోని ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ డెవలప్మెంట్ సంస్థ జురాంగ్ టౌన్ కార్పోరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు.
గురువారం ఉదయం 11 గంటలకు సింగపర్ హైకమిషనర్తో, సాయంత్రం నాలుగు గంటలకు విదేశాంగ మంత్రితో కేసీఆర్ సమావేశం అయ్యారు. 22న ఇంపాక్ట్ సదస్సులో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతారు. కాగా, కేసీఆర్, ఈటెల తదితరులు సింగపూర్లో పేరుగాంచిన పెరుమాల్ టెంపుల్లో స్వామివారిని దర్శించుకున్నారు.
పేరుమాల్ గుళ్లో ప్రసాదం తీసుకుంటున్న కేసీఆర్
పట్టణ అభివృద్ధి, ప్రణాళికలను అధ్యయనం చేసేందుకు 23న సింగపూర్ నుండి కౌలాలంపూర్ వరకు సిఎం కారులో ప్రయాణించనున్నారు. 24న తిరుగు ప్రయాణమై ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. సిఎంతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, అధికారులు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. కాగా, పెట్టుబడి పెట్టే వారికి సింగిల్ విండో విధానం ఉంటుందని కేసీఆర్ చెబుతున్న విషయం తెలిసిందే.
పేరుమాల్ గుడిలో హారతి తీసుకొని బొట్టు పెట్టుకుంటున్న కేసీఆర్, ఈటెల
కాగా, సింగపూర్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు అరుదైన బహుమతి లభించింది. కొందరు ఔత్సాహికులు తన బొమ్మతో ఉన్న హాలోగ్రాఫిక్స్ ఫ్రేంను ఆయనకు బహూకరించారు. ఎటువైపు నుంచి చూసినా కెసిఆర్ కనిపించడం ఈ ఫ్రేం ప్రత్యేకత.
పేరుమాల్ గుడిలో బొట్టు పెట్టుకుంటున్న కేసీఆర్, దండం పెడుతున్న ఈటెల
బ్రాండ్ తెలంగాణ పేరుతో సింగపూర్లో పర్యటిస్తున్న కేసీఆఱ్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటైన బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్నారు. సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం, సింగపూర్ హైకమిషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ సమ్మిట్లో కెసిఆర్ బొమ్మతో ఉన్న హాలో గ్రాఫిక్స్ ఫ్రేం ఆకర్షణగా నిలిచింది. సింగపూర్ పెట్టుబడిదారులకు కెసిఆర్ పూర్తి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్త ఏర్పడిన రాష్ట్రాభివృద్ధి కోసం అవినీతిరహితమైన వాతావరణంలో ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని కెసిఆర్ హామీ ఇచ్చారు.
పేరుమాల్ గుడిలో తీర్థం తీసుకుంటున్న కేసీఆర్
పూర్తిస్థాయి రక్షణ, భద్రతా ఏర్పాట్లతో అవినీతిరహిత రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణలో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో మొబైల్ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పెట్టుబడిదారుల ప్రతిపాదనలకు ఆలస్యం లేకుండా ప్రభుత్వాధికారులు, మంత్రులు ఆమోదం తెలిపే విధంగా యంత్రాంగాన్ని తయారు చేస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.
పేరుమాల్ గుడిలో కేసీఆర్కు శఠగోపం పెడుతున్న పూజారులు
పరిశ్రమలకు పూర్తి స్థాయి విద్యుత్తును అందించే విధంగా రానున్న ఆరు ఏళ్లలో 8 వెల మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రభుత్వం ప్రాజెక్టులను రూపొందిస్తోందని, అందుకు తగిన కృషి చేస్తోందని కెసిఆర్ చెప్పారు.