కవితనే ఉండాలా: రేవంత్, వెయ్యి అబద్దాలని రేణుకా
హైదరాబాద్: బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్గా తన కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ ఎన్నారైలకు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరుకుంటున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి సోమవారం విమర్శించారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ నెల 17వ తేదీన అధికారికంగా నిర్వహిస్తారో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగ సమీక్షకు విమలక్కను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. బతుకమ్మ పాటల కోసం విమలక్క గళం విప్పలేదా, వీధి పోరాటాలు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి బతుకమ్మ ఉత్సవాలకు రూ.10 కోట్లు కేటాయించారని, కానీ, కవితతో సమానంగా విమలక్కకు ప్రాధాన్యత ఏదని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్పై షబ్బీర్ అలీ నిప్పులు
బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ పచ్చి మోసం చేశారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మండిపడ్డారు. వంద రోజుల్లో కేసీఆర్ వెయ్యి అబద్దాలు ఆడారాని రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ పైన ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతులను ఆదుకోని ఈ ప్రభుత్వాన్ని బతుకమ్మ తల్లి క్షమిస్తుందా అని ప్రశ్నించారు.