భయం పుట్టేలా, సినిమాలల్లో: కేసీఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: మహిళా భద్రతకే తెలంగాణ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని, మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం కఠినంగా ఉంటోందనే భయం ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. మహిళల సమస్యలు - పరిష్కార మార్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కేసీఆర్కు శనివారం ప్రాథమిక నివేదిక ఇచ్చింది.
కమిటీ 77 సిఫార్సులతో ఇచ్చిన నివేదికను పరిశీలించిన సిఎం, కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అప్పటికప్పుడే కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. మహిళల సమస్యలు - పరిష్కార మార్గాలపై కమిటీ ఇచ్చిన నివేదికను సమీక్షించారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షమించవద్దన్నారు. అత్యంత కఠినంగా వ్యవహరించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరిపితే ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే భయం పుట్టేలా వ్యవహరించాలన్నారు.
పోలీసుల్లో 33శాతం మహిళలే ఉండే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మహిళా ఉద్యోగులపై ఏదైనా తప్పు జరిగితే సంబంధిత శాఖాధిపతులే బాధ్యత వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రయివేటుకార్యాలయాల్లో మహిళల కోసం భోజన గదులు, మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయాలని, అవసరమైతే కొత్త చట్టాలు తేవాలని ముఖ్యమంత్రి అన్నారు.
కేసీఆర్
మహిళల పట్ల సమాజంలో మార్పు రావాలని కేసీఆర్ అన్నారు. పాఠ్యాంశాల్లో దీనికి సంబంధించి అవగాహన తెచ్చే విధంగా పాఠాలు ఉండాలన్నారు. సినిమాలు, టీవీల్లో మహిళలను అవమానించి అసభ్యంగా చూపించే దృశ్యాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మహిళలను గౌరవించే విధంగా, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా ఉన్న సినిమాలు, టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
కేసీఆర్
ప్రతిశాఖలో మహిళల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, రాష్టస్థ్రాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పాఠశాల స్థాయి నుండే బాలికలకు దాడులను తిప్పికొట్టగలిగేలా శిక్షణ కార్యాక్రమాలు ఏర్పాటు చేయన్నుట్టు చెప్పారు. బస్సుల్లో అమ్మాయిలు ఒకేవైపు ఉండే విధంగా మధ్యలో గ్రిల్స ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమ్మాయిల తల్లిదండ్రులకు కూడా అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్
మహిళల భద్రత కోసం ఏయే దేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఉత్తమమైన కార్యక్రమాలను పరిశీలించేందుకు ఈ బృందం ఆయా దేశాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం మిషన్ ఉమెన్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయనున్నారు. మహిళల భద్రతపై తెలంగాణలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులపై ప్రశ్నావళి రూపొందించుకొని సమాధానాలు వెతుక్కునే క్రమంలోనే మంచి కార్యక్రమాలు రూపొందించుకోవాలని కమిటీకి ముఖ్యమంత్రి సూచించారు.
కేసీఆర్
రాష్ట్రంలో గృహ హింస ఏయే కారణాలతో ఎక్కువగా జరుగుతుందో విశ్లేషించి వాటికి పరిష్కారాలు సూచించాలన్నారు. ఈవ్ టీజింగ్, యాసిడ్ దాడుల వంటి బహిరంగ హింసాత్మక సంఘటనలకు కారణాలను అన్వేషించి, నివారణ మార్గాలు సూచించాలని కోరారు. సింగపూర్లో అర్ధరాత్రి దాటినా మహిళలు స్వేచ్ఛగా బయట తిరగగలరని, తెలంగాణలో అలాంటి రోజులు రావాలన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి, దానికి ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మిస్తామని, అవసరమైన నిధులు సమకూర్చుతామన్నారు.