అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమేనా?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రహ్మత్నగర్ డివిజన్లో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే గదిలో ఇద్దరు యువతులు భవానీ (17), శృతి (13) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ చావుకు ఎవరు బాధ్యులు కాదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. మృతిచెందిన ఇద్దరు యువతులు వరుసకు అక్కాచెళ్లెల్లు. దాంతో కుటుంబంలో విషాదం నెలకొంది
ఈ ఘటన ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రహ్మశంకర్నగర్ జరిగింది. ఒకే గదిలో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. రహ్మత్నగర్ డివిజన్ బ్రహ్మశంకర్నగర్లో నివాసం ఉండే సత్యనారాయణ పెయింటర్గా విధులు నిర్వహిస్తుంటాడు. అతని రెండవ కుమార్తె భవానీ (17) తండ్రితో విభేదించి అదే ప్రాంతంలో వేరుగా ఉంటోంది.
మైసమ్మగూడలో నివాసం ఉండే సత్యనారాయణ సోదరుడు రవీందర్ రెండో కుమార్తె శృతి (13) మైసమ్మగూడలో 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలోశృతి ఆదివారం రహ్మత్నగర్లోని బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో ఉన్న తమ సమీప బంధువు ఇంట్లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వచ్చింది. ఆ కార్యక్రమానికి భవానీ కూడా వెళ్లింది. అప్పటివరకు అందరితో కలిసిమెలిసి ఉన్న భవానీ, శృతిలు మధ్యాహ్నం బ్రహ్మశంకర్నగర్లోని భవానీ ఇంటికి చేరుకున్నారు.
ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానించిన స్థానికులు లోనికి చూడగా ఇరువురు ఇంటి పైకప్పు రాడ్కు చీరతో వేలాడుతూ కనిపించడంతో అప్రమత్తమైన స్థానికులు సమీపంలో ఉన్న శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కిందకు దించి చూడగా వారిద్దరు అప్పటికే మృతి చెందారు.
ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ‘మా చావుకు ఎవరు కారణం కాదు.. మేము హ్యాపీగా వెళ్లిపోతున్నాం' అని రాసి ఉన్న ఓ సూసైడ్ నోట్ లభించింది. అప్పటిదాకా తమతో ఆనందంగా గడిపిన కూతుళ్లు శవాలై కనిపించే సరికి వారి తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.
జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ పూర్తి చేసి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కాగా వీరి మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భవాని తండ్రితో విడిపోయి ఒంటరిగా బ్రహ్మశంకర్నగర్లో మరోచోట ఉండటంతో ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా? ఆమెతో పాటు శృతి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.