20 నుండి అసెంబ్లీ సెషన్స్, నీరిస్తేనే ఓటు అని..
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుండి నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీపావళి పండుగ దృష్ట్యా మధ్యలో మూడు రోజుల పాటు సమావేశాలకు విరామం ఇవ్వనున్నారు. ఈ సమావేశాలలో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది.
మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీరు ఇస్తేనే ఓటు అడుగుతామనే భరోసా ప్రజలకు ఇవ్వాలన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశం పైన చర్చించారు. 11వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 12వ తేదీన పరేడ్ గ్రౌండులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.
నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా మంచి నీటిని ఇవ్వాలని కేసీఆర్ అన్నారు. చెరువుల పూడికతీత, హరితవనాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. నీరు ఇస్తేనే ఓటు అడుగుతామనే భరోసాను ప్రజలకు ఇవ్వాలన్నారు. పోలీసు వ్యవస్థను మరింత బలపడేలా ప్రయత్నం చేస్తామన్నారు.