చానళ్ల బ్యాన్పై మంత్రి ప్రశ్న, తెరాసపై బీజేపీ లక్ష్మణ్
హైదరాబాద్: తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారెవరినీ తాము క్షమించబోమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా టీవీ9, ఏబీఎన్ చానళ్లు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కార్యక్రమాలు ప్రసారం చేశాయని ఆరోపించారు.
టీవీ 9, ఏబీఎన్ ప్రసారాలపై నిషేధాన్ని ఆయన సమర్థించుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టీ చానల్లో కార్యక్రమాలు ప్రసారాలు చేస్తే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? అని ఆయన ప్రశ్నించారు.
మజ్లిస్ అజెండా: లక్ష్మణ్
తెలంగాణ విమోచన దినోత్సవం పైన ప్రభుత్వం రేపటిలోగా ఒక ప్రకటన చేయాలని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. లేదంటే సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో తాము వాడవాడలా జాతీయపతాకాన్ని ఎగురవేస్తామని చెప్పారు. గోల్కొండ కోట మీదే తెలంగాణ విమోచన వేడుకలు జరపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల అజెండాను కాకుండా మజ్లిస్ అజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు.