మంత్రి పోచారం ఉద్వేగం, సమావేశంలో కంటతడి
హైదరాబాద్/నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఉద్వేగానికి లోనై సమావేశంలోనే కంటతడి పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో సోమవారం రక్షిత మంచినీటి ట్యాంక్ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తన గెలుపునకు కృషి చేశారని, మీ రుణం తీర్చుకోలేనిదంటూ ఉద్వేగానికిలోనయ్యారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలోఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలకు మంత్రి పదవులివ్వండి: షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర కేబినేట్లో ఒక్క మహిళా మంత్రిలేరని, వెంటనే మహిళలను మంత్రివర్గంలోకి తీసుకుని బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించాలని కాంగ్రెస్ మండలి పక్ష ఉపనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క తెలంగాణ ప్రాంతం నుంచే నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామన్నారు.
కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు విరసం నేత వరవర రావు, హరగోపాల్లతో తరచుగా మాట్లాడేవారని, కానీ ఇప్పుడేమో వారినే అరెస్టు చేయిస్తున్నారన్నారు. విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయుడు పొత్తూరు వెంకటేశ్వర్లుపై పోలీసులు చేయిచేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారన్నారు.