బ్యాన్పై చర్యలు తీసుకుంటా: టీ టిడిపితో గవర్నర్
హైదరాబాద్: తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని, తెలంగాణ సీఎం కేసీఆర్కు సూచన చేస్తానని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని తెలంగాణ టీడీపీ ప్రతినిధులు చెప్పారు. చానళ్లపై నిషేధానికి సంబంధించి శుక్రవారం సాయంత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో ప్రతినిధుల బృందం రాజ్భవన్లో కలిసి వినతి పత్రం సమర్పించారు.
మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి సంఘటనలు టీవీలో చూశానని, మీడియాపై సీఎం కేసీఆర్ చేసిన వాఖ్యలను పరిశీలించానని గవర్నర్ చెప్పారని టిడిపి నాయకులు మీడియాతో చెప్పారు. తన పరిధిలో ఉన్నంత వరకు టీవీ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్కు సూచిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
కెసిఆర్ మాట్లాడిన తీరుపై విచారణ జరిపించాలని, చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. టీవీ-9చానల్ పొరపాటుకు యాజమాన్యం క్షమాపణలు చెప్పిందని వారు గుర్తు చేశారు. ఎలాంటి పొరపాటుచేయని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారాలను నిలిపివేశారని విమర్శించారు. మీడియాపై అక్కసుతో దురుసుగా మాట్లాడిన కేసీఆర్ జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలయ్యారని, నియంత,నిరంకుశ నేత అనే పేరు రావడం మంచిది కాదన్నారు.
వరంగల్లో సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు రాజ్యాంగ వ్యతిరేకమని ఆయనపై పోలీసులు 506 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపాలని ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పై గౌరవం ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి కేసీఆర్ టీవీ చానళ్ల ప్రసారాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. రానున్న శాసనసభ సమావేశాల్లో టీఆర్ఎస్ నిరంకుశ విధానాలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.