తీగ లాగితే డొంక: అతని చేతిలో దొంగల ముఠాలు
హైదరాబాద్: కరుడుగట్టిన నేరగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి మొదలైన ఓ వ్యక్తి నేర చరిత్ర అనేక జిల్లాలకు పాకింది. గంజాయి సరఫరా, గ్యాంగ్లను ఏర్పాటుచేసి చోరీలు చేయించడం, జైలులో ఉన్న వారికి బెయిల్ ఇప్పించడంస వారికి న్యాయవాదులను ఏర్పాటు చేయడం, దొంగలు ఇచ్చిన బంగారాన్ని విక్రయించడం అన్నీ అతడి చేతుల మీదుగా జరిగేవి. అతని అసలు స్వరూపం బయటపడింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సుంకర ప్రసాద్ అలియాస్ ఆళ్లగడ్డ ప్రసాద్రెడ్డిపై ప్రకాశం, కర్నూలు, కడప, వరంగల్, మెదక్, విజయవాడ, హైదరాబాద్, సైబరాబాద్లో నేరచరిత్ర ఉంది. గిద్దలూరులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 15 ఏళ్ల జైలు జీవితం గడిపాడు. బయటకొచ్చిన తర్వాత ఓ హత్య కేసులో మళ్లీ జైలు కెళ్లాడు. ప్రసాద్ సైబరాబాద్లో 200 నేరాలు చేశాడు. దోపిడీలు, దొంగతనాలు, గంజాయి విక్రయాలు, దొంగ బంగారం అమ్మకాలు ఇలా ఒకటి కాదు చేయదగిన అన్ని నేరాల్లోనూ కీలకంగా వ్యవహరించాడు.
చోరీ చేసిన బంగారాన్ని విక్రయించిన కేసులో కుషాయిగూడ పోలీసులు ప్రసాద్ను అరెస్టు చేశారు. అతడ్ని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏ జిల్లాలోనైనా, ఏ ఇంట్లోనైనా, ఏ సమయానికి దొంగతనం చేయాలన్నా దాని వెనుక ప్రసాద్ పథకం ఉండేది. అతడు ఇటువంటి నేరాల కోసం పలు గ్యాంగ్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా సైబరాబాద్, హైదరాబాద్ల్లో వందల్లో చోరీలు చేశారు. చోరీలకు వెళ్లే గ్యాంగ్లకు సెల్ఫోన్ల ద్వారా మార్గదర్శకాలు ఇస్తుండేవాడు.
100 నుంచి 150 మంది ప్రసాద్ కనుసన్నల్లో పనిచేస్తున్నారు. వీరంతా దొంగిలించిన వస్తువులను ప్రసాద్ వివిధ ప్రాంతాల్లో విక్రయించేవాడు. వచ్చిన డబ్బులో సగం అతడి వాటాగా ఉండేది. మిగిలిన మొత్తాన్ని గ్యాంగ్ సభ్యులు పంచుకునేవారు. ఒకవేళ ఎవరైనా పోలీసులకు చిక్కి జైలు పాలైతే వారికి సాయం చేసే బాధ్యతలనూ ప్రసాద్ మోసేవాడు. జైల్లో ఉన్న దొంగలకు న్యాయవాదులను సమకూర్చడం, బెయిల్ ఇప్పించడం చేస్తుండేవాడు. ఇందుకోసం కమీషన్ వసూలు చేసేవాడు.
అవసరమైన వారికి అక్రమమార్గంలో గంజాయి సరఫరా చేస్తుండేవాడు. నకిలీ పోలీసుగాను, నకిలీ నక్సలైట్గా వ్యవహరించి పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. విచారణలో ఒక్కొక్క నేరాన్నీ పూసగుచ్చినట్టు వివరించడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రసాద్కు ఎవరెవరు సహకరించారన్న కోణంలో తీగ లాగడం మొదలుపెట్టారు. ప్రసాద్పై నెల్లూరు, నల్లగొండ, గుంటూరు, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో కేసులున్నాయి.