ప్రేమజంట ఆత్మహత్య: అప్పుల బాధతో నవవధువు
హైదరాబాద్: రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్లోని అల్వాల్ రైతుబజార్ సమీపంలోని రైలు పట్టాలపై చోటుచేసుకుంది. ప్రేమికుల వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదస్థలిని పరిశీలించి మృతుల వివరాల కోసం విచారణ చేపట్టారు.
అప్పుల బాధతో నవవధువు ఆత్మహత్య
ఓ నవవధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బండ్లగూడ సమీపంలోని అయ్యప్పకాలనీలో నివసించే స్వప్న(23), అదే కాలనీలో నివసించే హరిప్రసాద్ డిసెంబర్ 7న యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
హరిప్రసాద్ ఆటోనగర్లోని జైభవానీ ట్రాన్స్పోర్ట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఈ పెళ్లి అతడి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో తాను ఆర్థికంగా నిలదొక్కుకునేంతవరకు భార్యను పుట్టింట్లోనే ఉంచాడు. మరోవైపు స్థానికంగా స్వప్న తల్లిదండ్రులకు అప్పులున్నాయి. అప్పు తీర్చాలంటూ బండ్లగూడలోని ఓ మహిళ ఒత్తిడి చేసింది.
డబ్బుల్ని సోమవారం తప్పకుండా ఇస్తామని చెప్పిన స్వప్న తల్లిదండ్రులు.. మూడు రోజుల క్రితం తమ స్వగ్రామం గుంటూరుకు వెళ్లారు. సోమవారం సదరు మహిళ కొంతమందిని వెంటతీసుకుని వచ్చి ఆ ఇంటి వద్ద తిష్టవేసింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.