న్రిద్రమాత్రం మింగి ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం
కరీంనగర్: జిల్లాలోని పెద్దపల్లిలో ఓ ప్రేమ జంట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లికి చెందిన అపర్ణ అనే యువతి ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతుండగా, నాగరాజు అనే యువకుడు డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
కాగా, అపర్ణతో వివాహానికి నాగరాజు నిరాకరించడంతో, ఈ వివాదం ఇటీవల కులపెద్దల నుంచి పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. పెద్దపల్లి ఎస్ఐ, సిఐలు ఇరువర్గాల బంధువులతో పాటు ప్రేమ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే వీరి కులాలు వేరు కావడమే వివాదానికి కారణమని తెలుస్తోంది.
ఈ క్రమంలో వీరు మరోమారు పెద్దపల్లి సిఐ వద్ద కౌన్సెలింగ్కు వచ్చినట్లు తెలిసింది. ముందుగా అపర్ణ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, కులస్తులు వచ్చి సిఐని కలిసివెళ్లారనీ, సాయంత్రం చర్చలకు వస్తామని నాగరాజు కుటుంబ సభ్యులు చెప్పివెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నాగరాజు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు.
గమనించిన కుటుంబ సభ్యులు మొదట పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తర్వాత కరీంనగర్ తరలించారు. కాగా కొద్ది సేపటికి అపర్ణ కూడా నిద్ర మాత్రలు మిగి ఆత్మహత్యకు యత్నించింది. అపర్ణను కుటుంబసభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు.
అపర్ణతో తనకు ఎలాంటి సంబంధం లేదనీ, పోలీసులతోపాటు తన కుటుంబ సభ్యులు అపర్ణను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారనీ, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాగరాజు సూసైడ్ నోట్లో రాశాడు. కాగా తన కూతురును ప్రేమ పేరుతో మోసం చేసి, ఇప్పుడు పెళ్లి తప్పించుకునేందుకే నాగరాజు ఈ నాటకం ఆడుతున్నాడని అపర్ణ తల్లి ఆరోపించింది.