గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య: మహిళ పరారీ
హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీ నగర్ సాయినగర్ రోడ్డు నం.3లోని ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అతన్ని కత్తితో పొడిచి, బండరాయితో తలపై మోది హత్య చేశారు. చైతన్యపురిలో ఉంటున్న దామోదర్రెడ్డికి నాగోలు సమీపంలోని సాయినగర్ రోడ్డు నం.3లో 600 గజాల ఖాళీ స్థలం ఉంది. అందులో చిన్న రేకుల గది ఉంది. స్థల యజమానికి తెలియకుండా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కోదూరు గ్రామానికి చెందిన వెంకటమ్మ అందులో ఉంటోంది.
బుధవారం ఉదయం సదరు ఖాళీ స్థలంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుడి గొంతు, ఛాతీ, పొట్ట, తొడ భాగంలో కత్తిపోట్లు కనిపించాయి. తలపై బండరాయితో పాటు సిమెంట్ గడ్డతో మోది హత్య చేసినట్టు ఆనవాళ్లు కన్పించాయి. రేకుల గదికి కొద్దిదూరంలో మృతదేహం పడి ఉంది. దుండగులు అతన్ని హత్యచేయటానికి ప్రయత్నిస్తుండగా, పెనుగులాడిన ఆనవాళ్లు కన్పించాయి.
గదిలో గోడలకు రక్తం మరకలున్నాయి. గది నుంచి మృతదేహం పడి ఉన్న ప్రాంతం వరకు రక్తం మరకలు కన్పించాయి. సంఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. ఏసీపీ సీతారం, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు.
రేకుల గదిలో ఉంటున్న వెంకటమ్మ కన్పించకుండాపోయింది. రోజూ గదిలో ఉండే ఆమె కనిపించకుండా పోవడంతో హత్యతో ఆమెకు సంబంధాలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటమ్మ భర్తను వదిలిపెట్టి కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. రోజూ రాత్రి వేళ ఎవరెవరో వచ్చి వెళ్తుంటారని స్థానికులు తెలిపారు.
వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసుల భావిస్తున్నారు. వెంకటమ్మ ఆచూకీ, మృతుడి వివరాలు తెలిస్తే హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. స్థల యజమాని దామోదర్రెడ్డి ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.