గ్రేటర్: కేసీఆర్, అసద్లకు అమిత్ షా మరో షాకిచ్చేనా?
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాక, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ఆయన వ్యూహరచన చేయనున్నారనే వార్తల నేపథ్యంలో గ్రేటర్ రాజకీయం రసకందాయంగా మారింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ ఇంఛార్జిగా ఉన్న అమిత్ షా.. ప్రత్యర్థులను మట్టి కరిపించారు. యూపిలో ఉన్న 80 లోకసభ స్థానాలకు గాను 73 స్థానాలు బీజేపీ, మిత్రపక్షాలు గెలుచుకున్నాయి.
దాదాపు దశాబ్దానికి పైగా యూపీలో బీజేపీ నాలుగో స్థానంతో కొట్టుమిట్టాడుతోంది. అలాంటి బీజేపీని యూపీలో 73 సీట్లలో గెలిపించిన వ్యూహం అమిత్ షాది. ఇప్పుడు ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం వ్యూహరచన చేయనున్నారు. యూపీలో గెలిపించిన అమిత్ షా.. గ్రేటర్ పైన ఏవిధమైన వ్యూహరచన చేస్తారు? ఆయన వ్యూహం ఫలిస్తుందా అనేది చర్చనీయాంశమైంది.
గ్రేటర్ ఎన్నికల్లో ఏఏ పార్టీలు కలిసి వెళ్తాయనే విషయం దాదాపు స్పష్టకు వచ్చింది. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి వెళ్లే అవకాశముంది. అధికార తెరాస, పాతబస్తీలో పట్టున్న మజ్లిస్ కలిసి వెళ్లనున్నాయి. కాంగ్రెసు పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేయనుంది. తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో దోస్తీకి ససేమీరా అని మరీ పట్టుబడితే.. పరిస్థితి వేరుగా ఉంటుంది.
కేసీఆర్, అసద్లకు అమిత్ షా తొలి షాక్!
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నరేంద్ర మోడీని ప్రధాని కానివ్వమని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ సవాల్ చేశారు. అయితే, కేసీఆర్ అంచనా తారుమారైంది. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకుంటే కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని కేసీఆర్ భావించారు. అలాగే, మోడీని ప్రధాని కానివ్వమని అసద్ సవాల్ చేశారు.
అయితే, వీరి కలలను కల్లలు చేసింది ఒకవిధంగా అమిత్ షా అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే.. బీజేపీకి యూపీలో అన్ని సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. సర్వేలు కూడా బీజేపీకి 55 సీట్ల వరకు మాత్రమే వస్తాయని తేల్చాయి. అయితే, అనూహ్యంగా బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. తద్వారా బీజేపీ ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మేజిక్ ఫిగర్ దాటింది. మోడీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వేరే విషయం.
ఈ నేపథ్యంలో అమిత్ షా.. కేసీఆర్, అసద్లకు గ్రేటర్ ఎన్నికల్లో రెండోసారి షాక్ ఇస్తారా అనే చర్చ సాగుతోంది. పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి మంచి పట్టు ఉంది. తెరాస అధికార పార్టీ. ఈ నేపథ్యంలో ఆ కూటమికే మేయర్ పీఠం దక్కుతుందని భావిస్తున్నారు.
ఒకవేళ మజ్లిస్ - తెరాస కూటమి మేయర్ పీఠాన్ని దక్కించుకునే కార్పోరేటర్లను గెలుచుకోలేదంటే అమిత్ షా వ్యూహం ఫలితం ప్రారంభమైనట్లుగానే భావించవచ్చునని, 2019 నాటికి అది మరింత కనిపిస్తుందని చెబుతున్నారు. అలాగే, గత ఎన్నికల్లో కేవలం 5 కార్పోరేటర్లను గెలుచుకున్న బీజేపీ.. ఈసారి టీడీపీ లేదా జనసేనతో కలిసి మేయర్ పీఠం పంచుకున్నా లేక సొంతగా ఆశించినన్ని స్థానాల్లో గెలిచినా షా వ్యూహం ఫలించినట్లుగానే భావించవచ్చునని అంటున్నారు.