కత్తితో పొడిచి కూతురి హత్య: మృతురాలు(ఫొటో)
హైదరాబాద్: పేగు బంధం మరిచిపోయిన ఓ తల్లి తన కన్న కూతుర్నే కత్తి పొడిచి దారుణంగా చంపింది. ఈ దారుణానికి ఆమె మరో ఇద్దరు కూతుళ్లు సహకరించారు. ఈ ఘటన శుక్రవారం హైదరాబాద్లోని యుసుఫ్గూడ చోటు చేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో జరిగిన ఈ హత్య లక్ష్మీనర్సింహనగర్లో కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లాకు చెందిన సిద్దాంతం సాయిలక్ష్మి ముగ్గురు కుమార్తెలు శ్వేత కళ్యాణి (28), దివ్యజ్యోతి, విజయలక్ష్మితో కలిసి వెంకటగిరిలో నివాసముంటుంది.
టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. కుమార్తెలు ఇతర పనులు చేసుకుంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. అందరూ కలిసి కొద్దికాలం క్రితం లక్ష్మీనర్సింహనగర్లో 80 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. తల్లితో విభేదించిన శ్వేతకళ్యాణి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. లక్ష్మీనర్సింహనగర్లో తాత్కాలిక ఇల్లు ఏర్పాటు చేసుకొని నివాసముంటూ కృష్ణానగర్ బ్యూటీషియన్గా పనిచేస్తుంది. స్థలంపై అందరికీ హక్కు ఉంటుందని, అందులో ఇల్లు నిర్మించుకొని ఉందామని తల్లి ప్రతిపాదించింది. దీనికి కళ్యాణి ఒప్పుకోలేదు. దీంతో వీరికి నిత్యం గొడవలు జరిగేవి.
శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సాయిలక్ష్మి బురఖా వేసుకొని కళ్యాణి ఉంటున్న ఇంటికి వచ్చింది. ఆమె వెనుక ఇద్దరు కుమార్తెలు వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన సాయిలక్ష్మి వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో కళ్యాణిపై దాడి చేసింది. ముందుగా వెనుక భాగంలో కత్తితో రెండు చోట్ల పొడిచింది. కళ్యాణి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కడుపులో పొడిచింది. దివ్యజ్యోతి, విజయలక్ష్మి ఆమెకు సహకరించారు. స్థానికుల సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.