చిందేసిన ఆటా - 2012 మహా సభలు
అట్లాంటాలో జరిగిన పన్నెండవ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమావేశం, యువజనోత్సవాలు కన్నుల పండుగగా, వీనుల విందుగా ఆహూతులను అలరించాయి. ప్రముఖ యువ సంగీతసంచలనం థమన్ యస్.యస్. ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి, ఎంతో ఉల్లాసంగా, మరెంతో ఉత్సాహంగా, ఆడిటోరియం లోని ఎనిమిది వేల మంది ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అదే స్థాయిలో ఆకట్టుకొన్నాయి. ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను బహుకరించిన తర్వాత నటి హంస నందిని నృత్యం కూడా విశేషంగా ఆనందింప చేసింది.
ఈ వేడుకలకి విచ్చేసిన వీక్షకులలో ఎందరో కళాకారులు, మేధావులు, విద్యావంతులు, రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సినీ తారలు ఉన్నారు. జార్జియా వరల్డ్ కాంగ్రెస్స్ సెంటెర్ లో అందంగా అలంకరించిన మర్ఫి బాల్ రూం లో దాదాపు 3,500 మంది వైభవోపేతమైన విందును ఆస్వాదించారు. ప్రవాసాంధ్రుల కళా ప్రదర్శనలతో పాటుగా, నేటి తరం గాయనీ గాయకులు విజయలక్ష్మి, రేవంత్, భువన కృతి ల సమ్మోహన గీతాలాపనలు, గజల్ శ్రీనివాస్ అద్భుత ప్రదర్శన అతిథులను ఆకర్షించాయి. మూడు రోజుల ఈ వేడుకలలో భాగంగా, మొదటి రోజు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. తదుపరి జాతీయ గీతాలాపన, స్వాగత గీతం, తెలుగు సంస్కృతి సంప్రాదయాలను గుర్తుచేసే విధంగా ఆరంభ నృత్య రూపక ప్రదర్శన జరిగాయి.
ప్రారంభోపన్యాసం చేసిన వారిలో స్వామి చిదాత్మానంద(చిన్మయా మిషన్), కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లం రాజు, రాష్ట్ర మంత్రులు డి.కె.అరుణ, శ్రీధర్ బాబు, టివి 9 ప్రముఖులు రవి ప్రకాష్ లు ఉన్నారు. వాణిజ్య, రాజకీయ, అధ్యాత్మిక అంశాలు, మహిళ, ఎన్.ఆర్.ఐ. ఫోరంస్, సంబంధిత విశిష్ట వ్యక్తుల ప్రసంగాలతో, టి.వి.5 న్యూస్ స్కాన్ వెంకట కృషణ, ఎన్ కౌంటర్ విత్ రవిప్రకాష్,వసంత కుమార్ బిసినెస్ డెస్క్, మొదలగు కార్యక్రమాలను వందలాది ప్రేక్షకులు తిలకించారు. వీటన్నింటికి శిఖరాగ్రముగా, డా|| గరికపాటి నరసిమ్హారావు గారి అష్టావధానం నిలిచింది. ఆటా ఉత్సవాలు-2012 కే ఈ కార్యక్రమము సరికొత్త శోభను సమకూర్చింది.
కూచిపూడి నృత్యానికి చేసిన విశిష్ట సేవలకు గాను నాట్య కళా భూషణ శ్రీ వెంపటి చిన సత్యం గారికి ఆటా బృందం జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు. ఈ అవార్డ్ ను వారి శిష్యురాలు డా|| శోభానాయుదు గారి ద్వారా చెన్నై లో శ్రీ సత్యం స్వీకరించారు. ఈ ప్రదానోత్సవం ప్రత్యక్ష ప్రసారము గావించబడినది. మొదటి రోజు రాణి రుద్రమ, రెండు మూడో రోజులకు శిల్పా చక్రవర్తి వ్యాఖ్యాతలుగా ప్రేక్షకులలో ఎప్పటికప్పుడు ఉత్సవాలపై ఉత్సుకతను పెంచగలిగారు. అమెరికాలో, ఆంధ్రప్రదేశ్ లో నిస్వార్థ సమాజ సేవ చేసినందుకు గాను, ఆపన్నులకు సహాయ సహకారాలు అందించినందుకుగాను డా|| హనిమి రెడ్డి లక్కి రెడ్డి గారికి అత్యున్నత మానవతా పురస్కారముతో ఆటా సత్కరించింది. ఆటా ఉత్సవాలకు విచ్చేసిన అందరికి చక్కని రుచికరమైన పసందైన భోజన ఏర్పాట్లు అందించిన స్వాగత్ గ్రూప్ అధినేత జయరాం కోమటి సర్వదా ప్రశంసనీయమని ఆటా తెలిపింది.
ఆటా ఉత్సవాల అన్ని వేదికలకు స్పష్టమైన దృశ్య,శ్రవణ మాధ్యమాలను నిరంతరాయంగా అందించిన బైట్ గ్రాఫ్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు ప్రశాంత్ గారికి ధన్యవాదాలు తెలిపింది. వర్ధమాన నటీ నటులను, నృత్య దర్శకులను ప్రోత్సహిస్తున్న ఆటా వేదికకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు వంశీ పైడిపల్లి తమ ప్రత్యేక అభినందనలు తెలిపారు. జితేంద్రనాథ్ మిమిక్రి, హాస్య నటులు ఏ.వి.యస్., గౌతం రాజు, గుండు హనుమంతరావు, హేమ, అపూర్వ, శ్రీనివాస రెడ్డి, ల ప్రదర్శన కడుపుబ్బ నవ్వించాయి.
ఆటా నిర్వహించిన టాలీవుడ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని, అమెరికావాసులతో ముచ్చట్లు చెప్పిన అందాల సినీ తార ఇలియానా, వంశి పైడిపల్లి, ఏ.వి.యస్. బృందానికి ఆటా కృతఙ్ఞతలు చెప్పింది. తన అమూల్యమైన సమయాన్ని ఆటా తో పంచుకున్న మాజీ క్రికెటర్ , ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు అజారుద్దీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
12వ ఆటా ఉత్సవాలలో దాదాపు 130 మంది విక్రయదారులు తమ తమ ప్రదర్శనా స్టాల్స్ తో వచ్చిన ఆహూతుల మనసుకు నచ్చే విధంగా ఆకట్టుకున్నారని ఆటా చెప్పింది. చివరిగా, ఆటా ఉత్సవాలలో పాల్గొన్న కళాకారులకు, అథితులకు, నిర్వాహకులకు, దాతలకు, విక్రయదారులకు, ప్రపంచ నలుమూలల నుండి విచ్చేసిన ప్రేక్షకులకు ఆటా నిర్వాహక బృందం తమ కృతఙ్ఞతలను తెలుపుతోంది. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందించిన జార్జియా వరల్డ్ కాంగ్రెస్స్ సెంటర్ అధినేతలకి కూడా ఆటా కృతజ్ఞతలు తెలిపింది.
గత 18 నెలలుగా శ్రమిస్తూ, తమ సహాయాన్ని అందించటానికి స్వచ్చందంగా ముందుకొచ్చిన మెట్రో అట్లాంటా తెలుగు కమ్యూనిటి వారికి మరియు కో - స్పాన్సర్ గా ఉన్న గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పింది. ఆటా కాన్ఫరన్స్ కి ఫోటోగ్రఫి సహకారాన్ని అందించిన సురేష్ జిల్లా, శ్రీధర్ వాకిటి లకు కృతజ్ఞతలు చెప్పింది. ఝుమ్మంది నాదం కార్యక్రమాన్ని గత మూడు నెలలుగా ప్రమోట్ చేసిన TORI రేడియో కి కృతజ్ఞతలు చెప్పింది.