కోల్కత్తా: గాయాలకు శస్త్రచికిత్స పొంద తమ ఏడాది వయస్సు కుమారుడిని అమెరికా అధికారులు తమకు అప్పగించడానికి నిరాకరిస్తుండడంతో ఎన్నారై దంపతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఆ దంపతులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బలూర్ఘాట్కు చెందినవారు. తమ మనువడు అమెరికాలోని న్యూజెర్సీలోని ఇంటిలో ఆగస్టు 9వ తేదీన పడకపై నుంచి పడిపోయాడని, ఆ సమయంలో అతని తల్లి ప్రమీల ఇంటిలో వంట చేస్తోందని, తండ్రి దేబసీష్ కార్యాలయానికి వెళ్లాడని ఇంద్రాసిష్ నాయనమ్మ, తాత సోనారాణి సాహా, నిర్మల్ చెప్పారు.
వెంటనే ఇంద్రసీష్ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో చేర్చారు. శస్త్రచికిత్స జరిగింది. తమ కుమారుడు కోలుకోవడంతో అతన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి తల్లిదండ్రులు అడిగారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లనే అలా జరిగిందని, బాలుడిని రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని శిశు సంరక్షణ సంస్థ ఫిర్యాదు చేయడంతో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడానికి వైద్యులు నిరాకరిస్తున్నారు.
ఆ విషయంపై తాము ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశామని బాలుడి తాత మీడియాతో చెప్పారు. తన కుమారుడు పంచాయతీరాజ్ మంత్రి సుబ్రతా ముఖర్జీతో ఫోన్లో మాట్లాడాడని నిర్మల్ చెప్పారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని సుబ్రతా బెనర్జీ చెప్పారు.
నార్వేలోని భారత దంపతులు మే మాసంలో ఇటువంటి సమస్యనే ఎదుర్కున్నారు. ఇద్దరు పిల్లలను నార్వేలో శిశు సంరక్ష సర్వీస్ ఫోస్టర్ కేర్లోకి తీసుకుంది. రెండున్నర ఏళ్ల అభియాన్, ఐదు నెలల ఐశ్వర్య రక్షణకు తగిన చర్యలు తీసుకోవడం లేదని నార్వే అధికారులు ఆరోపించారు.



















