ఆటా సభలు ప్రారంభం: ప్రముఖుల హాజరు(ఫొటో)
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులపాటు సాగే 13వ ద్వైవార్షిక సమావేశాలు గురువారం(జులై 3న) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమెరికా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు హాజరయ్యారు. ఈ సమావేశాలు విందు కార్యక్రమంతో మొదలయ్యాయి.
చిన్నారుల నృత్య ప్రదర్శన, గానాలాపనలు అహుతులను అలరించాయి. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రవాసులకు, ప్రస్తుత, మాజీ ఆటా కార్యకవర్గ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు ఆటా కార్యవర్గం పురస్కారాలను అందించి సన్మానించింది.
విందు కమిటీ ఛైర్మన్ మాదిరెడ్డి రాజేష్ పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమంలో బెలీజ్ దేశంలో అమెరికా తరపున రాయబారిగా వ్యవహరిస్తున్న తుమ్మలపల్లి వినయ్ రెడ్డి, టాలీవుడ్ నటులు రానా, రిచా గంగోపాధ్యాయ, శ్రియా, సియాగౌతం, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలతోపాటు తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం, టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. విందుకు హాజరైన ప్రముఖులు ఆటా సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఆటా ఆధ్వర్యంలో సమాజానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఆటా అధ్యక్షుడు మాధవరం కరుణాకర్, కార్యదర్శి పజ్జూర్, అనంత్, సభల సమన్వయకర్త పరమేష్ భీంరెడ్డి, మోసర్ల మాధవ్, భుజాల భవనేశ్, తదితర సభ్యులు ఈ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.