ఒబామా ప్రశంసలందుకున్న ఎన్నారై భవనం(ఫొటోలు)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సుందరమైన ఆ భవనాన్ని చూసి ముచ్చటపడ్డారు. అంతటితో ఆగకుండా భవన యజమానికి ఫోన్ చేసి ఆ అందమైన భవనంపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, ఆ భవనం అమెరికాలో ఉంటున్న ఓ భారతీయుడిదే కావడం విశేషం. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీస్లో తాను వాడే ‘ద రెజల్యూట్' డెస్క్కు కాపీలా ఈ భవంతిలో ఉన్న డెస్క్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ భవన యజమాని అయిన భారతీయ అమెరికన్ను అభినందించాడు.
ఈ విషయమై ఇటీవల అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్ రావడంతో ఇంటి యజమాని ఫ్రాంక్ ఇస్లాం సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. భవంతిని సందర్శించిన అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్ దీని విశేషాలను తనకు వివరించారని ఒబామా ఆయనకు తెలిపారు. వాషింగ్టన్ శివారు పోటోమ్యాక్లో 47వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని ఫ్రాంక్, డెబ్బీ డ్రీస్మన్ దంపతులు ‘నోర్టస్ మనోర్' అని పిలుచుకుంటారు. వారు నిరుడు ఈ భవనంలో చేరారు.
ఈ భవనంలో 14 పడక గదులు, 22 స్నానాల గదులు, సినిమా థియేటర్, వ్యాయామశాల, సువిశాలమైన అతిథి గృహం ఉన్నాయి. ద రెజల్యూట్ డెస్క్ తోపాటు అమెరికా అధ్యక్ష భవనంలోని పలు వస్తువులు, అలంకరణ సామాగ్రిని పోలినవి ఇందులో ఉన్నాయి. భవంతి ప్రతిబింబించేలా దీని ముందు ఒక కొలను కూడా ఉంది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ను చూసి తనకు ఈ ఆలోచన వచ్చిందని, ఆగ్రాలోని తాజ్మహల్ ముందు కూడా ఇలాంటి అందమైన కొలను ఉందని ఫ్రాంక్ ఇస్లాం తెలిపారు. ఈ భవంతి నిర్మాణం ఏడేళ్లకు పైగా సాగిందని చెప్పారు. భవన నిర్వహణకు ఏడాదికి రూ. 9 కోట్లకు పైనే ఖర్చవుతోందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజాంగఢ్కు చెందిన రైతు కుటుంబంలో జన్మించిన ఫ్రాంక్.. 15ఏళ్ల వయస్సులో 1968లో అమెరికాకు వెళ్లారు. 500డాలర్లతో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి మిలియనీర్ అయ్యారు. వ్యాపారవేత్తగా రాణించిన ఆయన, ప్రస్తుతం సామాజిక, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.