విజయ్ శేషాద్రికి పులిట్జర్ అవార్డు
న్యూయార్క్: అమెరికాలోని భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత విజయ్ శేషాద్రికి 2014 సంవత్సరానికి గాను పులిట్జర్ అవార్డు లభించింది. ఆయన రాసిన '3 సెక్షన్స్' పుస్తకం పొయెట్రీ విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు 98వ వార్షిక బహుమతుల ప్రకటనలో కొలంబియా విశ్వవిద్యాలయం శేషాద్రికి అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు కింద 10 వేల అమెరికా డాలర్లను ఆయనకు అందజేయనున్నారు.
జర్నలిజం, లెటర్స్, డ్రామా, సంగీతం వంటి విభాగాల్లో ఈ అవార్డును ప్రతి యేటా ప్రకటిస్తుంటారు. న్యూయార్క్లోని లిబరల్ ఆర్ట్స్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా కవిత్వం, నాన్ ఫిక్షన్ రచనలను ఆయన బోధిస్తున్నారు. 1954లో బెంగళూరులో జన్మించిన శేషాద్రి ఐదేళ్ల వయసున్నప్పుడే ఓహియోకు వచ్చారు. ఇక్కడే పెరిగి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.
ఈ అవార్డు పొందిన భారత సంతతి రచయితల్లో విజయ్ శేషాద్రి ఐదోవారు. గోవింద్ బేహారి లాల్కు 1937లో ఈ అవార్డు లభించింది. ఆయన రిపోర్టింగ్ కెటగిరీలో సైన్స్ ఎడిటర్ అయిన ఆయనకు ఆ అవార్డు దక్కింది. ఆయన క్యాన్సర్తో 1992లో మరణించారు.
ఇండియన్ - అమెరికన్ రచయిత్రి జుంపా లహిరికి 2000లో పులిట్జర్ అవార్డు దక్కింది. ఆమెకు ఇంటర్ప్రిటర్స్ ఆఫ్ మాలాడీస్ అనే కథా సంకలనానికి ఈ అవార్డు లభించింది. ఆ తర్వాత జర్నలిస్టు రచయిత గీతా ఆనంద్ను ఆ అవార్డు వరించింది. క్యాన్సర్పై పుస్తకం రాసిన ఇండియన్ అమెరికన్ ఫిజిషియన్ సిద్దార్థ ముఖర్జీ కూడా పులిట్జర్ అవార్డు అందుకున్నారు.