రోగుల మరణం: ఎన్నారై వైద్యుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని న్యూమెక్సికో నగరంలో ఓ భారతీయ అమెరికన్ వైద్యుడు జైలు పాలయ్యాడు. అతనిపై నిబంధనలకు విరుద్ధంగా మందుల పంపిణీకి పాల్పడి ఇద్దరు రోగుల మరణానికి కారణమయ్యారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఫెడరల్ గ్రాండ్ జురీ ఆరోపణలు చేయడంతో.. భారతీయ అమెరికన్ వైద్యున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
డాక్టర్ పవన్ కుమార్ జైన్(61)పై చట్ట విరుద్ధంగా మందుల పంపిణీకి సంబంధించిన చర్యలకు గానూ 61 అభియోగాలు, హెల్త్కేర్ మోసానికి సంబంధించి కార్యకలాపాలకు గానూ 51 అభియోగాలు నమోదయ్యాయి. ఒకవేళ ఈ అభియోగాలు రుజువైతే ఇక్కడి చట్టాల ప్రకారం పవన్ కుమార్కు జీవిత ఖైదు శిక్షపడే అవకాశం ఉందని స్థానిక మీడియా సన్ న్యూస్ తన కథనంలో పేర్కొంది.
పవన్ కుమార్ న్యూమెక్సికోలోని లాస్ క్రూసెస్లో పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అతను ఫిజిషియన్, ప్రత్యేక న్యూరాలజీ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, అతనిపై ఆరోపణలు రావడంతో 2012 జూన్లో అతనికిచ్చిన మెడికల్ లైసెన్స్ను న్యూమెక్సికో మెడికల్ బోర్డ్ రద్దు చేసింది.
పవన్ కుమార్ జైన్ ఇచ్చిన మందులు వినియోగించిన కారణంగా ఇద్దరు రోగులు మరణించడంతో అతనిపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన ఏప్రిల్ 22, సెప్టెంబర్ 29, 2009 సంవత్సరంలో జరిగినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. ఈ నేరానికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక మిలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశాలున్నాయి. కాగా, హెల్త్ కేర్ మోసానికి పాల్పడిన కేసులో 10ఏళ్లపాటు జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశాలున్నాయి.