ఐఎన్ఓసి తెలంగాణ ఏర్పాటు
న్యూయార్క్: భారత జాతీయ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకుల ప్రసంగాలను తొలిసారిగా లైవ్ (ప్రత్యక్షప్రసారం) వెబ్ టెలీకాస్ట్ ద్వారా అమెరికాలోని ప్రవాసులకు అందించారు. ఈ కార్యక్రమాన్ని మాన్హట్టన్లో నిర్వహించారు. ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. కాగా, ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుధ్ ప్రకాష్ సింగ్ జోసుల ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
కాంగ్రెస్ పార్టీ కోసం గత సంవత్సరం చలో పంజాబ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రకాష్ తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ఓవర్సీస్ నాయకులను ఆయన పరిచయం చేశారు. రవి చోప్రా, కలథి వర్ఘీస్, ఫుమన్ సింగ్, కయానీ, ఇతరులు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. అనంతరం మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ డిచ్పల్లి లైవ్ వెబ్ ద్వారా ప్రసంగించారు. దశాబ్ధాల కాలంగా కొనసాగుతున్న ఉద్యమాలను, ప్రజల ఆకాంక్షను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు.
గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఉద్యమాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఐటి శాఖ మంత్రి.. ఐటి, ఇతర రంగాల అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టారని, పెట్టుబడులు కూడా వచ్చాయని తెలిపారు. దేశంలో భారతీయ జనతా పార్టీ హవా లేదన్న ప్రకాష్, గుజరాత్ అభివృద్ధి కల్పితమేనని అన్నారు.
పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల ఇంఛార్జ్ డాక్టర్ కరణ్సింగ్ వెబ్ టెలీకాస్ట్(రికార్డు చేసిన) ద్వారా మాట్లాడుతూ.. విద్యా హక్కు, ఉద్యోగ భద్రతా పథకం, ఆహార భద్రతా మొదలైన పథకాలను యూపిఏ ప్రభుత్వమే అమలు చేస్తోందని చెప్పారు. యూపిఏ సామాన్యుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తీసుకొచ్చిందని తెలిపారు. ఎన్నారై కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు.