కొడుకు హత్య, పొదల్లో పడేసింది: కోర్టులో ప్రత్యక్షం
లండన్: తన మూడేళ్ల కుమారుడిని హత్య చేసి పరారీలో ఉన్న ఓ భారత సంతతికి చెందిన మహిళ హఠాత్తుగా కోర్టులో ప్రత్యక్షమైంది. మంగళవారం ఆమె స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ కోర్టులో హాజరైంది. వివరాల్లోకి వెళితే.. రస్దీప్ కులార్(34) గత జనవరి 12నుంచి మూడు రోజులపాటు తన కుమారుడు మైకీల్ కులార్ను తీవ్రంగా కొట్టి హత్య చేసింది.
ఆ తర్వాత అతని మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసింది. అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులకు తన కుమారుడు కనిపించడం లేదంటూ జనవరి 16న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని, కులార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తీవ్ర గాయాలతో చెట్ల పొదల్లో పడివున్న మైకీల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా ఆ లోపే నిందితురాలైన రస్దీప్ పరారైంది. కాగా, గత మంగళవారం హఠాత్తుగా ఆమె కోర్టు ఎదుట ప్రత్యక్షమైంది. తన అసలు పేరు అడికోయా అని కోర్టుకు తెలిపింది. తనకు నలుగురు పిల్లలని, ఇద్దరు కవల పిల్లల్లో మైకీల్ ఒకడని చెప్పింది.
నిందితురాలితోపాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చారు. కుమారుడి హత్య చేసిన ఆమెకు ఎలాంటి పశ్చాతాప భావన లేదని అక్కడి మీడియా తన కథనంలో పేర్కొంది. జులై 25న తమ ముందు హాజరుకావాలని నిందితురాలు రస్దీప్ కులార్ను కోర్టు ఆదేశించింది. పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని కోర్టు నిందితురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై హత్యా నేరాభియోగాలు నమోదయ్యాయి.