జీవిత కాలం వీసాలు: ఎన్నారైలకు మోడీ వరాలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వరాలు ప్రకటించారు. ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని తనకు బాగా తెలుసునని, భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు. దాంతో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
జీవిత కాలం వీసాలు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన తర్వాత మీకు ఆనందమేనా అని అడిగారు. భారత సంతతికి చెందినవారు పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అమెరికాలోని భారత యంత్రాంగాలు అమెరికా పౌరులకు దీర్ఘకాలిక వీసాలను ఇస్తాయని, భారతదేశం వచ్చిన తర్వాత అమెరికా పర్యాటకులకు వీసాలు ఇస్తామని ఆయన చెప్పారు. ఆన్లైన్ వీసాల విధానాన్ని ప్రవేశపెడుతామని, ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి వీసా ఔట్సోర్సింగ్ను విస్తరిస్తామని చెప్పారు.
న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ నరేంద్ర మోడీ ప్రసంగంతో ఊగిపోయింది. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం మహాత్ముడికి ఇష్టమైన మొదటి పని అయితే రెండో పని సఫాయి అని, గాంధీ ఎప్పుడు పరిశుభ్రత విషయంలో రాజీ పడలేదని, 150వ జయంతి 2019లో వస్తోందని, గాంధీకి జయంతి నాటికి స్వచ్ఛ భారత్ను కానుకగా ఇవ్వలేమా, అది మన బాధ్యత కాదా? అని మోడీ అన్నారు. అందుకే 2019 నాటికి భారత్ను ‘స్వచ్ఛ భారత్'ను చేసేద్దామని అన్నారు.
మాడిసన్ స్క్వేర్స్లో భారత ప్రధాని మోడీ గంగా మాతను స్మరించుకున్నారు. గంగా నదిని శుద్ధి చేయడం ఎంత ముఖ్యమో చెప్పారు. భారత్లోని 40 శాతం జనాభా గంగపై ఆధారపడి ఉందని, ఆ నదిని శుద్ధి చేయడం ఆర్థికంగానూ ప్రయోజనకరమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐల సహకారాన్ని ఆయన అర్థించారు.