లిటిల్ స్టార్ సరే, చందమామ రావే వద్దా (పిక్చర్స్)
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ప్రవాసంలో నిరాటంకంగా 85 వ నెల సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారంనాడు ఈ నెల 17వ తేదీ స్థానిక నందిని రెస్టారెంటులో సాహిత్యవేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన జరిగింది. సమన్వయకర్త స్వాగతోపన్యాసంలో కార్యక్రమానికి అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో విచ్చేసిన డల్లాస్ ప్రాంతపు తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు స్వాగతం పలికారు. సాహిత్యవేదిక మొదటి భాగం నవరసభరితమయిన కవితాపఠనం, పుస్తక సమీక్ష, పద్య పఠనంతో అత్యంత ఆసక్తికరంగా జరిగింది.
స్థానిక చిన్నారులు శ్రియ సిద్ధార్థ, శ్రద్ధ సిద్ధార్థ "శ్రీ గణనాథాయ నమ ఓం 'ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించారు. ప్రస్తుతం ప్రవాసంలో పర్యటిస్తున్న తిరునగరి లక్ష్మణ స్వామి తెలుగు భాష సాహిత్యాలను ఆస్వాదింపచేస్తూ ఇటువంటి వేదికను ఏర్పాటు చేస్తున్న టాంటెక్స్ సాహిత్య వేదిక ను" చక్కని తెలుగు సాహిత్య వేదిక మక్కువ గొలిపే భావవీచిక "అని అభినందించారు. స్వీయ రచన " తెలుగు భాషా వైభవం", "అమ్మ" కవితలను వినిపించారు.
హరి రామబాణం పద్యాన్ని భావయుక్తంగా పాడి అర్ధాన్ని, రామబాణం విశిష్టతను వివరించారు. సాహిత్యవేదిక సభ్యుడు బసాబత్తిన శ్రీనివాసులు "మాసానికో మహనీయుడు" శీర్షికలో చక్రపాణి, గిడుగు రామ్మూర్తి పంతులు, భమిడిపాటి కామేశ్వర రావు గురించి ప్రస్తావించారు. స్థానిక చిన్నారులు శ్రియ సిద్ధార్థ, శ్రద్ధ సిద్ధార్థ శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు "శివ తాండవం" పద్యాలను వీనుల విందుగా వినిపించారు. సాహిత్యవేదిక సభ్యుడు పున్నం సతీష్ ఙ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి రచించిన "విశ్వంభర" పుస్తక సమీక్ష, విశ్వంభర తత్వాన్ని పంచుకున్నారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి విచ్చేసిన అందరూ వేదికలో పాలు పంచుకునేలా సరదాగా తెలుగు జాతీయాలు, కొంటె సామెతలతో క్విజ్ నిర్వహించారు. కొత్తగా వేదికకు విచ్చేసిన వారిని ఆహ్వానిస్తూ తోటి తెలుగు వారికి నోటి మాటగా ప్రతి మూడవ ఆదివారం జరిగే సాహిత్య వేదికకు ఆహ్వానించవలసిందిగా అందరినీ అభ్యర్ధించారు.
అభినందన ఇలా..
ముఖ్య అతిథి ప్రముఖ కథ, నాటక, టి వి సీరియల్, చలనచిత్ర రచయిత, జాతీయ, రాష్ట్ర నాటక పురస్కార గ్రహీత నడిమింటి నరసింగరావు ఈ వేదికకు 'నెల నెలా తెలుగు వెన్నెల' అని పేరు పెట్టి తెలుగు సాహిత్యాన్ని వెన్నెలతో పోల్చి అందరికి పంచుతూ "పొయెటిక్ జస్టిస్" చేశారని అభినందించారు.
చందమామ రావేకు అలా..
ప్రపంచం అంత 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' దగ్గర ఆగిపోతే మన అన్నమయ్య 'చందమామ రావే' అని అందరికి సాహితీ వెన్నెలని పంచారు కాని మన భాష అంటే మనకి అలసత్వం, నిర్లక్ష్యం విచారించవలసిన విషయం నడిమింటి నరసింగ రావు అన్నారు.
ప్రశ్నల మీద ప్రశ్నలు..
నేటి యువత చదువుతున్న పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రైసిస్ మేనేజ్ మెంట్, పాజిటివ్ ఎనర్జీ, ఫిక్షన్, పుస్తకాలు మన రామాయణం, మహాభారతం, భగవద్గీత, కాశీ మజిలీ కథల కంటే మించినవా అని ఉద్వేగంగా ప్రశ్నించారు.
రాయడమే ముఖ్యం
కథలు, నాటికలు, టి వి సీరియల్, సినిమా కథల పై తన ప్రస్థానాన్ని చక్కని ఉదాహరణలతో వేదికతో పంచుకున్నారు. రచన ఏదైనా చదివిన వారికి అర్ధమయ్యేలా ఉండాలి కాని శైలి, శిల్పం ముఖ్యం కాదు, రాసేది ఏదయినా కొత్త కోణం లో ఆలొచించి రాయండని నరసింగ రావు సూచించారు.
బతికించుకోవాల్సిన బాధ్యత
నేడు మృతభాషగా మారిపోతున్న తెలుగు భాషను బ్రతికించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉందని తెలియజేస్తూ తమ ప్రసంగం ముగించారు.
సత్కాకరం
ముఖ్య అతిథి ప్రసంగానంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, పూర్వాధ్యక్షుడు మండువ సురేష్, కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణ రెడ్డి కార్యవర్గ సభ్యులు వీర్నపు చినసత్యం, శీలం కృష్ణవేణి, చిట్టిమల్ల రఘు, సింగిరెడ్డి శారద, తెలుగు సాహిత్య వేదిక సభ్యులు సంయుక్తంగా దుశ్శాలువతో సత్కరించి నడిమింటి నరసింగరావ్ గారికి జ్ఞాపికను బహుకరించారు.