డల్లాస్లో సిలికానాంధ్ర 'తెలుగు మాట్లాట' పోటీలు
డల్లాస్/టెక్సాస్: అమెరికాలో తెలుగువారి పిల్లల్లో తెలుగు భాష మరింత వాడుకలోకి రావాలన్న ఉద్దేశ్యంతో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జూన్ 7వ తేదీన 'మనబడి - తెలుగు మాట్లాట' భాషా వికాస పోటీల కార్యక్రమం డల్లాస్ నగరంలో జరిగింది. జూన్ 7న మొదటి విడత పోటీలు జరిగాయి. 5 నుండి 9 ఏళ్ల వయసు పిల్లలు (బుడుతలు విభాగం) మరియు 10 నుండి 13 ఏళ్ల వయసు పిల్లలు (సిసింద్రీలు విభాగం) మొత్తం దాదాపు 50 మంది పాల్గొన్నారు.
తెలుగు మాట్లాట పోటీలు ఉదయం 9:00కు 'ఒక్క నిమిషం మాత్రమే'తో ప్రారంభమయ్యాయి. తమకు ఇచ్చిన అంశాలపై పిల్లలు ఉచ్చారణ, వ్యాకరణ, భాషా దోషాలు లేకుండా వాగ్ధాటిగా మాట్లాడారు. దీంతో తల్లిదండ్రులు, పోటీలు చూసేందుకు వచ్చిన వారు ఆనందించారు. ఈ పోటీల్లో ఇందులో నందుల రోహన్ కౌశిక్ మొదటి బహుమతి, తుమ్మూరి తేజస్విని రెండవ బహుమతి, కస్తూరి ప్రణవ్ మూడవ బహుమతి పొందారు.
తర్వాత జరిగిన తిరకాటం ప్రశ్నావళి పోటీ పిల్లలని విశేషంగా ఆకట్టుకుంది. తిరకాటం బుడుతలు పోటీలో తుమ్మూరు హిమజ, చింతలపాటి మోహన, పోగోలు ఋషిల్, గుండ శ్రీనిధి, మల్లెంపాటి వెన్నెల, శ్రీరంగం హ్రిషీకేశ్లు చివరి పోటీలలో పాల్గొనేందుకు అర్హత పొందారు. తిరకాటం సిసింద్రీలు పోటీలో నందుల రోహన్ కౌశిక్, భాస్కరుని మిథిలేశ్, కస్తూరి ప్రణవ్, నందుల నిఖిల్ కార్తీక్లు చివరి పోటీలలో పాల్గొనేందుకు అర్హత పొందారు.
అనంతరం, అక్షరమాల పోటీ పదరంగం నిర్వహించారు. ఈ పోటీలో సరళ పదాలను మొదలుకొని క్లిష్టమైన పదాలను కూడా విని రాశారు. పదరంగం బుడుతలు పోటీలో తుమ్మూరు హిమజ, చింతలపాటి మోహన, పాలూరి ఇతిహాస్, సామి సిద్ధార్థలు, సిసింద్రీలు పోటీలో కొతపల్లె శ్రియ, నందుల రోహన్ కౌశిక్, భాస్కరుని మిథిలెశ్, గుండ వరుణ్లు చివరి పోటీలలో పాల్గొనేందుకు అర్హత పొందారు.
ఈ పోటీల వలన తమ పిల్లలకు ఎన్నో కొత్త పదాలు చదవడం, రాయటం, మాట్లాడటం వచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు. కాగా, ఈ పోటీలు రెండవ విడత ఆగష్టు నెలలో నిర్వహిస్తారు. ప్రస్తుతం అర్హత పొందిన పిల్లలు.. ఆగస్టులో జరిగే పోటీలో అర్హత పొందిన వారితో కలిపి చివరి పోటీలో పాల్గొంటారు. అప్పుడు విజేతలను నిర్ణయిస్తామని నిర్వాహకులు చెప్పారు.
ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా గుండిమెడ మధుసూదన్, సాహు కృష్ణచంద్రలు వ్యవహరించారు. డల్లాస్ తెలుగు మాట్లాట జట్టు నాయకుడు కస్తూరి గౌతం నేతృత్వంలో కళ్యాణి సిద్ధార్థ, చింతలపాటి శ్రీధర్, పాలూరి రామారావు, చిన్ని వేంకటేశ్వర, కస్తూరి మైథిలి, ముద్దన బుద్ధ, దివాకర్ల మల్లికార్జునలతో పాటు స్థానిక స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమానికి సహకారం అందించారు.