సిరివెన్నెల అంతరంగం: ఊపేసిన పాడుతా తీయగా
డల్లాస్: అమెరికాలో తెలుగు సంగీత, సాహిత్య, సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్ర బిందువైన డాలస్ నగరంలో స్థానిక ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో "సిరివెన్నెల అంతరంగం" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అర్వింగ్ లోని జాక్ సింగ్లీ ఆడిటోరియంలో శనివారం మధ్యాహ్నం 500 మంది ఆత్మీయ తెలుగు బంధుగణం మధ్య అత్యంత ఆహ్లాదంగా జరిగింది. సుప్రసిద్ధ నేపధ్యగాయకులు "పాడుతాతీయగా" పార్ధు (పార్ధసారధి), "సూపర్ సింగర్" సాహితి కలిసి సిరివెన్నెల గీతాల్ని ఆలపిస్తే, ఆ పాటల ప్రస్థానాన్ని, అంతర్యాన్ని, అంతరంగాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి స్వయంగా టాంటెక్స్ సభ్యులు, బంధు-మిత్రుల కోసం ఆవిష్కరించిన ఒక వినూత్నకార్యక్రమమే "సిరివెన్నెల అంతరంగం".
సిరివెన్నెల పాటలు, ఆయన మాటలు, ఆయనతో ముఖాముఖి అందించిన ఈ అద్భుత అవకాశం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రత్యేకంగా నిర్వహించింది. టాంటెక్స్ అధికారికంగా గత 28 సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ ముఖ్యోద్దేశంగా ఉత్తర టెక్సస్ ప్రాంతీయ తెలుగు కుటుంబాలకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. క్యూబాలో ప్రస్తుత భారతీయ రాయబారిగా వ్యవహరిస్తున్న గౌ. శ్రీ రాజశేఖర్ చింతపల్లి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేశారు. టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ విజయమోహన్ కాకర్ల తమ కీలకోపన్యాసంలో శ్రీ రాజశేఖర చింతపల్లి ఒక తెలుగువాడిగా ఉన్నతహోదాలో సేవలందించడం తమకు ఆనందంగా ఉందని కొనియాడారు.
టాంటెక్స్ సంస్థ మన తెలుగు వారికి బాగా నచ్చే కార్యక్రమాలను చేపట్టనున్నామని, ఇందుకు "సిరివెన్నెల అంతరంగం" ఒక చక్కని నాంది పలికిందని శ్రీ కాకర్ల వ్యాఖ్యానించారు. శ్రీ చింతపల్లి దంపతులను సాంప్రదాయ బద్ధంగా శ్రీ విజయమోహన్ కాకర్ల, పాలక మండలి ఉపాధిపతి శ్రీ అజయ్ రెడ్డి, మరియి సభ్యుడు శ్రీ సుగన్ చాగర్లమూడి సన్మానించారు. కార్యక్రమ "ప్రిమియర్" పోషక దాతలైన నేషనల్ సిస్టమ్స్ కన్సల్టింగ్ (ఎన్ ఎస్ ఐ) ప్రతినిధులు శ్రీమతి కృష్ణవేణి మరియు సత్యనారాయణ రెడ్డి శీలం, "ప్రజెంటింగ్" పోషక దాతలైన టె క్నోసాఫ్ట్ గ్రూప్ అధినేత శ్రీ శ్రీని గాలి, "మిణుగురులు" చిత్రం దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ల వదాన్యతను గుర్తిస్తూ రాయబారి గౌ. శ్రీ రాజశేఖర్ చింతపల్లి చేతులమీదుగా కృతజ్ఞతా పూర్వక జ్ఞాపికలను అందించారు.
అంతకుముందు "సిరివెన్నెల అంతరంగం" కార్యక్రమ సమన్వయకర్త డా. నరసింహారెడ్డి ఊరిమిండి విచ్చేసిన ప్రేక్షకులకు, అతిథులకు స్వాగతం పలికి, పది నంది పురస్కారాలు అందుకొన్న ఏకైక తెలుగుకవి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని, నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు "పాడుతాతేఎయగా" పార్థసారథి, మరియు వర్ధమాన నేపధ్య గాయని "సూపర్ సింగర్" సాహితి లను మిన్నంటే కరతాళ ధ్వనుల మధ్య వేదిక పైకి ఆహ్వానించారు.
తొలి చిత్రమే శ్రీ సిరివెన్నెల సాహితీ గ్రంధానికి ముఖ చిత్రం అయ్యిందని, వారి పాట "సప్తవర్ణ శోభితమై పులకించే ధవళ కాంతి పుంజమని", "ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథమని", "జాగృత మానసంలో దేదీప్య మానమై వెలిగే దీపశిఖ అని", "సామాజిక పరిణామానికి ఒక విశిష్ఠ వేదికని", సిరివెన్నెల పాటల ప్రత్యేకతను గుర్తిస్తూ ఆయన ప్రతీ పాట ఒక యజ్ఞం" అని డా. ఊరిమిండి కొనియాడారు.
దాదాపు మూడు గంటల సేపు కొనసాగిన "సిరివెన్నెల అంతరంగం సంగీత సమాహారంలో శ్రీ సీతారామ శాస్త్రి అంతరంగాన్ని ఆవిష్కరించడం కోసం చేసే ప్రయత్నంలో వ్యక్తిగతం, అభిరుచి, సినీ ప్రస్థానం, రచనలు వంటి అనేక అంశాలను పార్థు, సాహితీల గానమాదుర్యం జోడించి స్పృశించారు. అంతర్లీనంగా ఆయనలోని ఆవేశాన్ని అక్షరాలుగా సంధించడానికి కారణం, భాష సరళమైనా, కాకున్నా భావ పటుత్వం ఉండాలనే పట్టుదల, తన మస్తిష్కంలో ఉన్న భావనే పాటగా మలుస్తానని ఆయన చెప్పే మాటలో ఉన్న సూటిదనంతో పాటు తన గత జీవితంపై ఆయన పంచిన మాటల సారాంశం ప్రేక్షకుల హృదయాలను ద్రవీభవించింది.
గత పదహారు సంవత్సరాలకు పైగా ఉత్తర అమెరికాలో సంగీత సాహిత్య విఙ్ఞాన వినోదాలను అందిస్తూ విజయవంతంగా నడుస్తున్న ఏకైక తెలుగు రేడియో, "గానసుధ-మన టాంటెక్స్ రేడియో", ఇటీవల అంతర్జాలంలో టోరి సహకారంతో నిర్వహిస్తున్న "టాంటెక్స్ తరంగిణి" లకు 2013 సంవత్సరానికి వ్యాఖ్యాతలుగా సేవలందించిన శిరి వూటూరి, అద్రిక కందుకూరి, పరిమళ మార్పాక, శ్రీ బసాబత్తిన, ఇందిర మేడూరి, జయ పెనుమర్తి లని అభినందిస్తూ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి చేతుల మీదుగా సన్మాన జ్ఞాపికలను అందజేశారు. 2014 వ్యాఖ్యాతల జట్టును పరిచయం చేసారు.
టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు "ఇవెంట్" పోషకదాతలైన శ్రీ అజయ రెడ్డి, శ్రీ భీమ పెంట, శ్రీ హరి నాయుడు, డా. కృష్ణబాబు చుండూరి, డా. నరసింహారావు వేముల, డా. శ్రీనివాస రెడ్డి ఆళ్ళ , డా. సుబ్రహ్మణ్యం రెడ్డి బోయ, డా. ఉమ చింతపల్లి, బత్తుల అసోసియేట్స్ , ప్రవీణ్ బిల్లా-రియాల్టర్, ఆఫ్టర్ గ్రాడ్వేట్. కం, హోరైజన్ ట్రావెల్, సన్ డాన్స్ బహేవియరల్ హెల్త్ కేర్ సిస్టమ్స్, స్పైస్ రాక్/బిర్యాని పాట్/బాంబే చోప్ స్టిక్స్ లను పుష్పగుచ్చం, జ్ఞాపికలతో సన్మానించి వారందించిన ఆర్ధిక సహకారాన్ని అభినందించారు.
"సిరివెన్నెల అంతరంగం" ప్రత్యేక కార్యక్రమ సమన్వయకర్త డా. నరసింహారెడ్డి ఊరిమిండి ఎంతో ఓపికగా కార్యక్రమాన్ని వీక్షించి చివరి క్షణం వరకు సహకరించిన ప్రేక్షకులకు, కార్యక్రమ "ప్రిమియర్" పోషక దాతలైన నేషనల్ సిస్టమ్స్ కన్సల్టింగ్ (ఎన్ ఎస్ ఐ), "ప్రజెంటింగ్" పోషక దాతలైన టె క్నోసాఫ్ట్ గ్రూప్ మరియు మిణుగురులు చిత్రం దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి మరియు జాక్ సింగ్లీ ఆడిటోరియం సిబ్బందికి, ఎంతో ఉత్సాహంతో తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసిన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పాడుతాతీయగా "పార్థు", సాహితి లకు, కృతఙ్ఞతాభివందనాలు తెలియ జేసారు.