కువైట్ తెలుగు కళా సమితి రచన పోటీలు: విజేతలు
ఈసారి మొత్తం 105 ఎంట్రీలు అందాయని, వాటిలో మూడు రచనలను ఉత్తమ మైనవిగా ఎంపిక చేసినట్లు కువైట్ తెలుగు కళా సమితి అధ్యక్షుడు జిఏ నరసింహరాజు, ఉపాధ్యక్షుడు కె సుధాకర్ రావు, కార్యదర్శి కె వెంకట్ తెలిపారు.
ప్రథమ ఉత్తమ రచనగా నడిమింటి జగ్గారావు రచించిన ‘క్షమాస్మృతి' నాటిక ఎంపికైనట్లు చెప్పారు. ఈ రచనకు గానూ త్వరలో ఏర్పాటు చేయనున్న బహుమతి ప్రదానోత్సవ సభలో రచయితకు రూ. 20వేల నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ద్వితీయ ఉత్తమ రచనగా తాళాబత్తుల వేంకటేశ్వరరావు రచించిన ‘సైకత శిల్పం' రచనకు రూ. 15వేలు అందించనున్నట్లు తెలిపారు.
తృతీయ ఉత్తమ రచనగా గడ్డం సుబ్బారావు రచించిన ‘నయనం' నాటిక రచనకు రూ. 10వేలు అందజేయనున్నట్లు చెప్పారు. ప్రోత్సాహ బహుమతులకు డాక్టర్ కెజి వేణు రచించిన ‘ఆ.ఆ' అనే నాటికకు, విద్యాధర్ రచించిన ‘స్వరార్ణవం', కాశీవిశ్వనాథ్ రచించిన ‘అభ్యుదయానికి ఆహ్వానం' అనే నాటికలు ఎంపికయ్యాయని, ఈ బహుమతుల కింద ఒక్కొక్కరికి రూ. 5వేల నగదు పురస్కారాన్ని అందజేస్తామని తెలిపారు.