ప్రమాదంలో గాయపడిన తెలుగు విద్యార్థి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఎన్.అభియన్ రెడ్డి అనే ఆ విద్యార్థిని ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) పిలుపునిచ్చింది. ఈ సంఘటనతో అభినయ్ కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారని తెలిపింది. వారిని ఆదుకునేందుకు తెలుగు వారు తమ శక్తిమేరకు సహాయం చేయాలని కోరింది.
కరీంనగర్కు చెందిన అభినయ్ ఇండియానా స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. గత శనివారం ఇండియానాలోని టెరెహాట్లో ప్రమాదవశాత్తూ ఒక ఈతకొలనులో మునిగిపోయారు. సుమారు 20 నిమిషాలపాటు ఆయనను ఎవ్వరూ గమనించలేదు. ఆ తర్వాత అభినయ్ని నీటి నుంచి బయటికి తీశారు. అయితే, ఊపిరితిత్తులు, మెదడుకు చాలాసేపు ఆక్సిజన్ అందకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం అభినయ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అభినయ్ మరో ఆరునెలల్లో వర్సిటీ నుంచి పట్టా పుచ్చుకోనున్నాడు. తన బంగారు కలలు నెరవేరనున్న ఈ సమయంలో ఆస్పత్రిపాలు కావడంపట్ల 'నాట్స్' తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అభినయ్ చురుకైన విద్యార్థి అని, అందరితో కలుపుగోలుగా ఉంటారని తెలిపింది. గ్రేటర్ ఇండియానాపొలిస్ తెలుగు అసోసియేషన్ (గీతా)తో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పింది.
"తెలుగు వారు అభినయ్ని ఆదుకునేందుకు వీలుగా విరాళాలు సేకరించాల్సిందిగా విజ్ఞప్తి'' అని నాట్స్ కోరింది. అలాగే... అమెరికాలో తెలుగు వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సహాయం అవసరమైనా నాట్స్ హెల్ప్లైన్ నెంబర్ 1-888-483-5848కు కాల్ చేయవచ్చునని తెలిపింది. అభినయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ నెంబర్ ఫోన్ చేసి విషయం చెప్పగానే స్పందించామని చెప్పింది.