తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర

శుక్రవారం, అక్టోబర్ 14, 2011, 12:21 [IST]
Sathyabama character in Telugu literature
శ్రీకృష్ణుని అష్టభార్యలలో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగునాట సాహిత్యంలో విశిష్టమైన పాత్ర సంతరించుకొంది. స్వాధీనపతికయైన నాయిక గాను, సరస శృంగారాభిమానవతిగాను, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా గర్వం మూర్తీభవించినదానిగాను సత్యభామ పాత్రను చిత్రీకరించారు.పోతన భాగవతంలో నరకాసుర వధ సందర్భంగా సత్యభామ పాత్రను అందమైన పద్యాలలో చిత్రీకరించాడు. యుద్ధం సమయంలో ఆమె హరునికి ప్రియశృంగారమూర్తిగాను, శత్రువుకు భీకర యుద్ధమూర్తిగాను ఒకేమాఱు దర్శనమిచ్చిందట..
నంది తిమ్మన పారిజాతాపహరణం, కూచిపూడి నాట్యం, భామా కలాపం వంటి వాటిలో సత్యభామ పాత్ర చిత్రీకరణ జరిగింది. నంది తిమ్మన పారిజాతాపహణంలో సత్యభామ పాత్రను చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. సత్యభామ సత్రాజిత్తు కుమార్తె. శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు. ఈమె భూదేవి అవతారమని విశ్వసిస్తారు. గోదాదేవి సత్యభామ అవతారమని అంటారు. భాగవతం దశమ స్కంధంలో సత్యభామ వృత్తాంతంలో నరకాసుర వధను ప్రముఖంగా చెప్పారు. అందులో చెప్పిన విషయాలు శ్యమంతకోపాఖ్యానం, నరకాసుర వధ, పారిజాతాపహరణం, శ్రీకృష్ణ తులాభారం.

వినాయక వ్రత కల్ప విధానంలో చదివే వ్రతకథలోని శ్యమంతకోపాఖ్యానం ద్వారా సత్యభామ పరిణయవృత్తాంతం హిందువులకు సుపరిచితం. సత్రాజిత్తు సూర్యోపాసనచే శ్యమంతకమనే మణిని సంపాదించినాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు అడవికి వెళ్ళినాడు. సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది. నిజం తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభంతో శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి మణిని అపహరించాడని అనుమానించి నిందన పాలు చేసాడు. ఆ నింద నుంచి బయటపడడం శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించి, జాంబవంతుని ఓడించి, మణిని తీసుకుని నగరానికి వెళ్ళి పురజనులను రావించి జరిగిన వాస్తవాన్ని వివరించి నింద నుంచి శ్రీకృష్ణుడు బయటపడ్డాడు. నిజం తెలిసిన సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది మణిని ఇవ్వడమే కాకుండా తన కూతురు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేశాడు. ధర్మబుద్ధితో శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. అలా సత్యభామను కృష్ణునికిచ్చి పెళ్ళి చేసినందుకు కోపించిన శతధన్వుడు తరువాత కాలంలో సత్రాజిత్తును సంహరించాడు.

శ్రీకృష్ణునికి సత్యభామ ద్వారా కలిగిన సంతతి - భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, కలిభానుడు, శ్రీభానుడు. తెలుగునాట అధిక ప్రచారంలో ఉన్న కథ ప్రకారం నరకాసురుడు తన తల్లి తప్ప వేరొకరితో మరణం లేకుండా వరం పొందాడు. ఈ సంగతి తెలిసిన కృష్ణుడు యుద్ధంలో మూర్ఛపోయినట్లు నటించగా, భూదేవి అవతారమైన సత్యభామ ధనుస్సు ఎక్కుపెట్టి వదలిన బాణంతో నరకుడు మరణించాడు.
English summary
Sathyabama character in Telugu literature.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs