వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్లవ స్వాప్నికుడు శివసాగర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shiva Sagar
శివసాగర్ ఒక స్వాప్నికుడు. భావనా ప్రపంచంలోనే కాదు, కార్యరంగంలోనూ ఆయన స్వాప్నికుడే. కవిగా, విప్లవకారుడిగా శివసాగర్ ఓ రోమాంటిక్. ఆయన కవిత్వానికన్నా కార్యరంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పవచ్చు. కవిత్వాన్ని ఆయన తన కార్యరంగానికి ఉత్ప్రేరకంగా వాడుకున్నారని అనిపిస్తుంది. తనకు తాను సర్దిచెప్పుకోవడానికి తాను కలలు కనే సమాజం ఏర్పడి తీరుతుందని గుండె దిటవు చేసుకోవడానికి ఓ కలల ప్రపంచాన్ని నిర్మించుకున్నట్లు అనిపించేవాడు. అందుకే ఆయన రాజకీయ క్షేత్రంలో ప్రయోగాలు చేస్తూ వెళ్లారు. మూడు దశాబ్దాల పాటు తాను కలలు కన్న సమాజాన్ని సృష్టించడానికి విప్లవోద్యమంలో పనిచేశాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన రాజకీయాలను వదులుకోలేదు. రాజకీయాలతో ప్రయోగాలు చేస్తూ వెళ్లాడు. విప్లవోద్యమ ఆచరణను, మార్క్సిజం పరిమితులను కూడా ఆయన ప్రశ్నించారు. అందుకే ఎదుటివాళ్లకు సమాధానం చెప్పాలని అనుకున్నారో, తనను తాను సంతృప్తి పరుచుకోవడానికి ప్రయత్నించారో గానీ రాజకీయాలు మాత్రం వదిలిపెట్టలేదు. అయితే, విప్లవోద్యమం నుంచి వచ్చిన తర్వాత చేసిన రాజకీయ ప్రయోగాలన్నింటిలోనూ ఒక ఏకసూత్రత ఉంది. అది దళితోద్యమానికి సంబంధించిన ఏకసూత్రత.

బయటకు వచ్చిన తర్వాత కాన్షీరాం నాయకత్వంలోని బిఎస్పీలో చేరారు. ఇంకా మరికొన్ని పార్టీల్లోనూ చేరారు. ఆయన ఆలోచనాపరిధికి, ఆచరణ పరిధికి అవి సరిపోలేదు. దాంతో ఎక్కడా ఉండలేకపోయారు. కానీ ఒక మహా విప్లవం తేవాలని మాత్రం ఆయన కలలు కన్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆయన ఎంత రాజకీయ కార్యకర్తనో అంతగా కవి కూడా. కవిగా చెప్పాల్సి వస్తే అభ్యుదయ కవిత్వానికి శ్రీశ్రీని నాయకుడిగా నిలబెడితే, విప్లవ కవిత్వానికి శివసాగర్ను నాయకుడిగా నిలబెట్టాల్సి వస్తుంది. రాజకీయాలను ఓ భుజాన, కవిత్వాన్ని మరో భుజాన మోస్తూ వచ్చాడు. ఉద్యమం నెలబాలుడు కవిత్వం ఆయన రాజకీయ విప్లవ కవిత్వానికి మార్గదర్శనం చేస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలను కళాత్మకంగా శివసాగర్ కన్నా బలంగా వ్యక్తీకరించిన కవి తెలుగులో లేడు. బహుశా ఉండకపోవచ్చు కూడా. అయితే, ఆయన పాయ మాత్రం ఒకటి సాగుతూనే ఉన్నది. ఆ పాయ ప్రత్యామ్నాయ రాజకీయాల్లో నిబద్ధతకు కాకుండా నిమగ్నతకు సంబంధించింది. ఆ రకంగా ఆయన విప్లవ కవిత్వానికి నాయకుడు.

తాను నిరాశలో ఉన్నప్పుడు కవిత్వం రాశానని ఆయన ఓసారి నాతో అన్నాడు. శ్రీకాకుళోద్యమం వెనుకంజ వేసిన తర్వాతనే తాను ఉద్యమం నెలబాలుడు కవిత్వాన్ని రాశానని చెప్పుకున్నాడు. అంటే, పోరాటంలో ఉన్న వ్యక్తి వైఫల్యంలో ఉన్నప్పుడు కావాల్సిన ఉత్సాహాన్ని ప్రోది చేసుకోవాలి. అలా ప్రోది చేసుకోవడానికి ఆయన కవిత్వం రాశారని చెప్పవచ్చేమో. కానీ, రాజకీయాలను అత్యంత కవిత్మాత్మంగా చెప్పే పని కూడా ఆయన చేశారు. అది కూడా అలాంటి స్థితిలోనే చేశారేమో కూడా. ఆయన రాసిన కవితా పంక్తులు ప్రత్యామ్నాయ రాజకీయాలను నడుపుతున్నవారికి నినాదాలుగా మారాయి. శివసాగర్కు విప్లవ కవుల్లో బాగా నచ్చినవారు చెరబండరాజు, గద్దర్. వీరిద్దరి కవిత్వం కూడా అంతే. గొప్ప కాల్పనికతతో నినాద స్థాయికి ఎదిగిన కవిత్వం వీరి విషయంలోనూ చూస్తాం. తెలంగాణ జిల్లాల్లోని జానపద బాణీలను స్వీకరించి ఆ బాణీలను విప్లవీకరించారు. కార్యాచరణకు పురికొల్పే కవిత్వం రాశారు. దళితవాదాన్ని అక్కున చేర్చుకున్న తర్వాత కూడా అదే నిమగ్నతతో కవిత్వం రాశాడు. నల్లసూర్యుడు కవిత దళిత కవిత్వానికి ఒక నమూనా.

శివసాగర్ రెవెల్యూషనరీ రోమాంటిక్. ఇది ఆయన విప్లవకారుడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, దళిత కార్యకర్తగా ఉన్నప్పటి కాలానికి కూడా వర్తిస్తుంది. తన కవిత్వం ప్రధానంగా తనకు సంబంధించిన రెవెల్యూషనరీ సైకాలజీ కళాత్మక పరిశోధన ఆయన చెప్పుకున్నాడు. రెవెల్యూషనరీ పర్సెప్షన్లో మార్పు వచ్చిందనే విషయాన్ని ఆయన అంగీకరించలేదు. తన కవిత్వం విప్లవ ప్రస్థానమని, అది దానంతటదే విప్లవవంతో పెనవేసుకు పోయిందని, తన అభిప్రాయంలో నిజమైన విప్లవం జీవితంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన అన్ని పార్శ్వాల తలుపులు తడుతుందని, విప్లవం గానీ విప్లవ కవిత్వం గానీ రాజకీయ రంగం ఒక్కదానికే పరిమితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి విప్లవ కార్యాచరణ నుంచి దళిత విప్లవ కార్యాచరణకు వచ్చానని ఆయన స్పష్టంగానే అనుకున్నారని చెప్పవచ్చు. విప్లవ కార్యాచరణ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రావడానికి ఆ కార్యాచరణ తాను నమ్మినట్లు అన్ని పార్శ్వాల తలుపులు తట్టకపోవడమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్థికాంశాలను ప్రధానం చేసుకుని సాగుతున్న రాజకీయ ఉద్యమానికి సరిజోడుగా సాంస్కృతికోద్యమం సాగాలని కూడా ఆయన నమ్మినట్లు చెప్పవచ్చు. ఎవరి పని వారు చేసుకోవడమనేది సంస్కృతిలో ఇమిడి ఉందని ఆయన అనుకునేవారు. విప్లవోద్యమం ఫలించిన దేశాల్లో కూడా అది అమలు కాలేదని ఆయన భావించాడు. సాంస్కృతికోద్యమం జరగకుండా జరిగే అభివృద్ది ఏదీ గుణాత్మకం కాదని ఆయన విశ్వసించాడు. ఆ కారణంగానే ఆయన దళిత ఉద్యమాన్ని అక్కున చేర్చుకున్నాడని, కేవలం పుట్టుకతో దళితుడైనంత మాత్రాన కాదని మనం అర్థం చేసుకోవడానికి తగిన భూమిక శివసాగర్ వద్ద ఉండేది. దళితవాదం ఆధిపత్య సంస్కృతిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చింది. స్థీరికృత విలువలు ఆధిపత్య సంస్కృతికి సంబంధించినవి. నిటారుగా కనిపిస్తున్న విలువలు ఆధిపత్య భావజాలానికి సంబంధించినవి, వాటిని తలకిందులు చేయడమే దళితవాదం చేయాల్సిన పని. దానికి వాహికగానే దళితవాద సాహిత్యం ముందుకు వచ్చింది. ఈ దళితవాద సాహిత్యంలో ఆయన దళిత ఈస్తటిక్స్ కు అర్థం చెప్పే పని చేశాడు. నల్లసూరీడు కవిత అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది.

శివసాగర్ ఆచరణను, కవిత్వాన్ని వేరు చేయడానికి కుదరదు. ఆయన ఆచరించింది, ఆచరించాలని అనుకున్నది మాత్రమే ఆయన కవితావస్తువు అయింది. అది కేవల వచనం కాదు, కళాత్మక అభివ్యక్తి. రాజకీయ కార్యకర్తగా కెజి సత్యమూర్తి విఫలమయ్యాడో, కొంత మేరకైనా సఫలమయ్యాడో చెప్పలేం గానీ కవిగా ఆయన మరెవరూ అందుకోని స్థాయికి చేరుకున్నాడు. పురాణ ప్రతీకలకు ఆయన కొత్త అర్థం చెప్పాడు. శంభూకుని చేతిలో రాముడ్ని వధింపజేశాడు. ఇలా పురాణాల్లో విజయం సాధించిన నాయకులను పరాజితులుగా, పరాజితులను విజేతలుగా చూపించాడు. అంటే, సమాజంలోని విశ్వాసాలపై కవిత్వం వేటు వేశాడు. అంటే, విజేతలు కావాల్సిన వారు పరాజితులుగా మిగిలిపోకూడదని ఆయన భావించాడు. ఆధిపత్య సంస్కృతిని దళిత సంస్కృతి, లేదంటే ద్రావిడ సంస్కృతి ఓడించాలని ఆయన కలలు కన్నాడు. అందుకు అనుగుణంగానే దళిత కవిత్వాన్ని రాశాడు. ఉద్యమం నెలబాలుడు నుంచి నడుస్తున్న చరిత్ర దాకా వచ్చిన కవిత్వం ఆయనలోని విప్లవ దళితుడిని, దళిత విప్లవకారుడిని చూపిస్తుంది.

విప్లవ దళితవాదం హేతువాదాన్ని ఆశ్రయించింది. ఆ హేతువాదం వల్ల దళితుల పీడన అప్పుడు ఆ స్థాయిలోనే వ్యక్తమైంది. గుడిలోకి రావద్దన్నావు, నువ్వు రానీయకపోవడమే మంచిదైంది (ఇవే చరణాలు కావు) అని సలంద్ర కవిత్వం చెప్పాడు. అంటే, ఆధిపత్య సంస్కృతితో విప్లవాచరణలోని దళితవాదం ఘర్షణను నివారించింది. రెండు విరుద్ధ శక్తుల మధ్య హేతువాదం ఘర్షణను నివారించింది. అదే సమయంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని నిలబెట్టలేకపోయింది. దళితవాదం ఘర్షణకు మార్గం వేసింది. ఇది సాంస్కృతిక రంగంలో జరగాల్సిన ఆచరణకు దారి తీసింది. ఈ విషయం శివసాగర్కు బాగా తెలుసు. అందుకే తన కవిత్వంలో పురాణ ప్రతీకలను తిరిగేసి చెప్పాడు. దళిత విప్లవకారుడిగా ఆయన ఆ పని చేశాడు. ఆ క్రమంలోనే ఆయన దళిత కవుల్లో పైడి తైరేష్ బాబును, మద్దూరి నగేష్ బాబును ఇష్టపడ్డాడు. నల్లగొండ దళిత కవులను ప్రేమించాడు. మొత్తంగా రాజకీయ కార్యాచరణకు సంబందించిన అనివార్యత ఆయన కవిని చేసింది.

- కాసుల ప్రతాప రెడ్డి

English summary
Sivasagar, a Telugu poet and political activist, has died recently, posed his impact on literature and revolutionary and Dalit movements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X