రాచకొండను కాపాడుకుందాం: జయధీర్
హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వాలు రెండు చోట్ల ఉన్న తెలుగు ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలని ప్రముఖ పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమల రావు అన్నారు. సాంస్కృతిక చారిత్రక సంపదని పరిరక్షించేందుకు వెనక్కు పోరాదని ఆయన సూచించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా రాచకొండ చారిత్రక సాంస్కృతిక సంపదను కాపాడుకోవడం బాధ్యతగా ‘రాచకొండను కాపాడుకుందాం' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
నల్లగొండ జిల్లాలో 5652 హెక్టార్లు , రంగారెడ్డి జిల్లాలోని 1322 హెక్టార్ల భూమిలో ఫీల్డు ఫైరింగ్ రేంజి ఏర్పాటుకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని, దీనివల్ల సుమారు 30 కిలోమీటర్లు వైశాల్యంలో జీవావరణం దెబ్బతింటుందని అన్నారు. ఆరు గ్రామాలలో శతాబ్దం క్రితం నుండి అక్కడ జీవిస్తున్న గిరిజనులు దీనిని వ్యతిరేకిస్తున్నారని అభయారణ్యంలోని ఐదు వందల కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు.
ఈ విధ్వంసాన్ని ఆపడానికి గిరిజనులకు మద్దతుగా రాచకొండ పరిరక్షణ వేదిక క్షేత్రం పర్యటన జరిపి సమాచారం సేకరించిందని, ప్రజల అభిప్రాయాలు ఉన్నవి ఉన్నట్టుగా సేకరించి నివేదిక తయారుచేసిందని అన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా రాచకొండను పరిరక్షించాలని చెప్పారు. చారిత్రక స్థలాల విధ్వంసం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని, ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కాంట్రాక్టర్ల స్వార్ధానికి వారికి కొమ్ముకాస్తున్నారని అన్నారు.
ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా వీరితో కుమ్మక్కు కావడం బాధాకరమని అన్నారు. ఇక మీదట అలాంటి పరిస్థితి ఉండరాదని సూచించారు. ఇంటాక్ రాష్ట్ర కో కన్వీనర్ ఎం వేదకుమార్ , డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, డాక్టర్ ధ్యావనపల్లి సత్యనారాయణ, జి వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.