గ్రాసియా మార్క్వెజ్ కన్నుమూత
మెక్సికో: నోబెల్ బహుమతి గ్రహీత, మ్యాజిక్ రియలిజం రచనల దిట్ట, కొలంబియా రచయిత గాబ్రియల్ గ్రేసియా మార్క్వెజ్ కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పాఠకులను ఆయన శోకసముద్రంలో ముంచెత్తారు. 87 ఏళ్ల మార్క్వెజ్ గురువారంనాడు తుది శ్వాస విడిచారు.
వార్తాపత్రికలో రిపోర్టర్గా వృత్తిని స్వీకరించిన మార్క్వెజ్ విస్తృతంగా సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించారు. ఆయన వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సొలిట్యూడ్ మాస్టర్ పీస్. ఆ రచనకు గాను ఆయనకు 1982లో నోబెల్ బహుమతి వచ్చింది.
మార్క్వెజ్ మెక్సికో నగరంలోని తన నివాసంలో మరణించారు. న్యూమోనియాకు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చారు. మిత్రులు, అభిమానులు గాబోగా పిలుచుకునే మార్క్వెజ్ లాటిన్ అమెరికా రచయితల్లో ప్రసిద్ధమైనవాడు.
కొలంబియాలోని కరేబియన్ తీరంలో గల ఆరకాటకా గ్రామంలో 1927 మార్చి 6వ తేదీన మార్క్వెజ్ జన్మించారు. ఆయన తండ్రి టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేసేవారు. ఆయన రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన నవల వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ 35 భాషల్లోకి అనువాదమైంది. దీని మొదటి ప్రచురణ 1967లో జరిగింది.