సినారెకు సత్కారం: కెసిఆర్ కలబోత
హైదరాబాద్: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి జన్మదిన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. సాహిత్యం పట్ల తనకు గల అభిరుచిని ప్రకటించుకున్నారు. సినారెను ప్రశంసలతో ముంచెత్తారు.
ఆయన 84వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రవీంద్ర భారతిలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సినారె రచించిన ‘నింగికెగిరిన చెట్లు' గ్రంథాన్ని ఆవిష్కరించారు. పుస్తకం తొలి ప్రతిని అమెరికాలో స్థిరపడ్డ కార్డియాలజిస్టు శ్రీనివాసరెడ్డి ఆళ్లకు అందించారు.
ఇక నేను దొరికిపోయినట్లేనని నా స్నేహితులందరూ అనుకున్నారని, పోటీలో భాగంగా మీకు నచ్చిన గ్రంథం గురించి రాయండని ప్రశ్న ఇచ్చారని, కాసేపు ఆలోచించగా సినారే రచించిన మందార మకరందం గ్రంథం గుర్తుకొచ్చిందని, దానిలో ఏముందో అదే నకలు గొట్టినట్లు రాశానని ఆయన వివరించారు.
హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా విశాలంధ్ర బుక్డిపోలో మూడు నాలుగు పుస్తకాలు కొనుక్కుపోయేవాడినని, ఒక రోజు పుస్తకాలు కొంటుండగా సినారె మందార మకరందం నచ్చి తీసుకుని దాన్ని రెండు మూడు సార్లు చదివానని, అదే అక్కడ రాశానని కేసీఆర్ వెల్లడించారు.
వాక్కు అంటే తనకు ఎంతో ఇష్టమని, అది శబ్ద రూపంలో ఉంటే మాట అని లిఖిత రూపంలో ఉంటే గ్రంథమని సినారె అన్నారు. తాను పురుషులలో ఉత్తముణ్ని పూజిస్తానని ఆయన చెప్పారు. తన ఇష్ట దైవం ఎవరని చాలా మంది ప్రశ్నిస్తుంటారని వారందరికీ చెప్పే సమాదానం ఒక్కటేనని, తన ఇష్టదైవం శబ్దమని వివరించారు. ఆ శబ్దమే తనను నడిపిస్తోందన్నారు.
సంవత్సరాలుగా సాగుతోన్న విమర్శలు, ప్రతివిమర్శలు, ‘నువ్వెంత అంటె నువ్వెంత' అనుకోవడాలు, దాడులు, ప్రతిదాడుల పర్వం నుంచి సాంత్వన లభించిందని కెసిఆర్ ఈ కార్యక్రమంలో అన్నారు. ఉద్యమ సమయంలో ఒకసారి అమెరికాలోని అట్లాంటా నుంచి వచ్చిన ఒక అమ్మాయి తనను కలవడానికి తమ ఇంటికి వచ్చిందని, కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నేను లోపలికి వెళ్లబోతుంటే ‘సార్ ఒక్క నిమిషం..' అంటూ ఆపి తెలంగాణ మాండలికంలో తాను ప్రసంగాలు చేసే శైలిని మార్చకూడదని కోరిందని ఆయన తెలిపారు. ‘‘అంతే కదా.. వాళ్ల అమ్మ వాళ్లకెంత గొప్పనో, మన అమ్మ మనకు అంతే గొప్ప'' అని అన్నారు.
తెలంగాణ ముద్దుబిడ్డ
సి. నారాయణ రెడ్డి తమ బిడ్డ.. తెలంగాణ బిడ్డ.. తెలంగాణకు మొదటి ముద్దు బిడ్డ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రముఖ కవి, సాహితీవేత్త సి. నారాయణరెడ్డిని ప్రశంసించారు.
సినారే పాటలే..
నాటి కార్యక్రమాల్లో సినారే రచించిన పాటలు లేకుండా ‘మీరు కోరిన పాటలు' ఉండేవి కావని కెసిఆర్ గుర్తుచేశారు. ‘‘ఇప్పుడైతే నువ్వు, నేను కోరిన పాటే ఉండదు'' అంటూ చమత్కరించారు.
కలబోసుకున్న కెసిఆర్
సినారె గురించి, ఆయన పుస్తకంపై తాను చదువుకునే రోజుల్లో రాసిన వ్యాసం గురించి కెసిఆర్ తనదైన శైలిలో మాట్లాడారు. తన చిన్ననాటి విషయాలను, ఇతర విషయాలను కెసిఆర్ ముచ్చట పెట్టినట్లుగా కలబోసుకున్నారు.
ఎన్టీఆర్ ఆఫర్ను కాదన్నారు..
సినారే ప్రతిభను గుర్తించిన ఎన్టీఆర్ ఆయనకో అవకాశం ఇవ్వాలనుకుని తన సినిమాలో ఒక పాట రాయాల్సిందిగా కోరారని, అయితే సినారే మాత్రం ఎన్టీఆర్ ఆఫర్ను తిరస్కరించారని కెసిఆర్ చెప్పారు.
సినారెది ధైర్యమే..
‘రాస్తే సినిమాలోని మొత్తం పాటలు రాస్త అంతేకానీ ఒక్కపాట రాయను' అంటూ ఎన్టీఆర్కు ఎదురుగా మాట్లాడారు. ఎన్టీఆర్ అప్పటికే పెద్ద పర్సనాలిటీ ఆయన ముందు అలా మాట్లాడాలంటే ధైర్యం కావాలని కెసిఆర్ అన్నారు.
ఒక్క పాట రాస్తే..
సినిమాలోని ఒక్క పాట రాస్తే సత్తా ఎలా తెలుస్తుంది.. మొత్తం పాటలు రాస్తేనే కదా... మనలో ఉన్న సత్తాఏంటో తెలిసేదని, ఆ అవకాశంతో సినారే నాటి నుంచి ఇప్పటి వరకూ వెనుదిరిగి చూసుకోలేదని కెసిఆర్ అన్నారు.
నన్ను దోచుకుందువటే..
‘నన్ను దోచుకుందువటే..' అంటూ ఆయన రాసిన పాటలు ఇప్పటికీ పాడుకునేలా ఉంటాయి'' కెసిఆర్ అన్నారు.
ఇద్దరు గురువులు..
తనకు జయశంకర్, సినారె ఇద్దరు గురువులని, వాళ్లు తెలుగు భాషకు, సాహిత్యానికి చేసిన సేవ ఎనలేనిదని కెసిఆర్ కొనియాడారు. సిద్దిపేటలో తాను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచీ సినారెతో తనకు పరిచయం ఉందని తెలిపారు.
సిద్ధిపేట నుంచి వచ్చామని...
తమ కాలేజీలో తాను సాహిత్య విభాగానికి సెక్రటరీగా ఉండేవాడినని, ఒకసారి తమ కాలేజీలో జరిగే కార్యక్రమానికి సినారెను ఆహ్వానించడానికి హైదరాబాద్ వచ్చామని, సార్ ఇంటికెళ్లి ఆయన్ను కలిసి.. ‘మేము సిద్దిపేట నుంచి వచ్చాం' అని చెప్పామని కెసిఆర్ అన్నారు.
కవితా మూర్తి సినారె...
తాము ఆ విషయం చెప్పగానే సినారె కవిత్వం అందుకుని.. ‘మా ఊరు హనుమాజీపేటకు బాట మీ సిద్దిపేట' అంటూ ఒక్కమాటలో తనకు సిద్దిపేట తెలుసని చెప్పారు. అంతటి కవితామూర్తి సినారె అని, మాటల మధ్యలో కవిత్వాలతో పాటు కొంటె ప్రశ్నలు కూడా వేసేవారని కెసిఆర్ చెప్పారు.
నేనే ఫస్ట్
తమ కాలేజీలో ప్రతి శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించేవారని, ఆ పోటీల్లో ప్రతిసారీ తనకే బహుమతి వచ్చేదని, దీంతో మీరు చంద్రశేఖర్రావు పట్ల పక్షపాతం వహిస్తున్నారంటూ తన తోటి స్నేహితులు ప్రొఫెసర్లపై దండయాత్రకు దిగారని ఆయన అన్నారు.
వ్యాసరచన పోటీ..
తనకు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టమని ఆయన అన్నారు. ఆ కారణంగా తాను వ్యాసాలు బాగా రాసేవాడినని, అయితే ఓసారి అకస్మాత్తుగా వ్యాస రచన పోటీ పెట్టారని ఆయన అన్నారు. దీంతో ఈసారి కచ్చితంగా తాను ఓడిపోతానని అనుకున్నారని కెసిఆర్ వివరించారు.
అయినా నాకే బహుమతి
అప్పుడూ తనకే బహుమతి వచ్చిందని, మళ్లీ తన స్నేహితులు ప్రొఫెసర్లతో గొడవకు దిగారని, ఆ తరువాత ‘ఇది ఎలా రాశావురా' అని మా ప్రిన్సిపాల్ గంగారెడ్డి తనను అడిగారని, అప్పుడు మందార మకరందం గురించి చెప్పానని కెసిఆర్ వివరించారు.