2011 ప్రపంచకప్ పై ప్రభావం!

మంగళవారం, మార్చ్ 3, 2009, 17:40 [IST]
World Cup
న్యూఢిల్లీ: శ్రీలంక ఆటగాళ్లపై లాహోర్‌లో ఉగ్రవాదులు దాడులు చేయడంతో ఉపఖండం వేదికగా జరుగనున్న ప్రపంచకప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దాడులను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్‌లో ప్రపంచ కప్‌ నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ పాలక మండలి త్వరలో సమావేశం అవుతుందని ముఖ్య కార్యనిర్వహణాధికారి హరూన్‌ లార్గట్‌ తెలిపారు. 2011లో జరిగే ఈ ప్రపంచకప్‌ భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు పాకిస్థాన్‌ కూడా ఆతిధ్యం ఇవ్వనుంది. ఐసీసీ సమావేశంలో దాడిపై సమీక్షిస్తామని ఆయన తెలిపారు. అంతే కాకుండా భారత ఉపఖండంలో ప్రపంచకప్‌ నిర్వహించడంపై పునరాలోచన చేస్తామని ఆయన చెప్పారు. తుది నిర్ణయం ఐసీసీ రెండు రోజుల్లో చెబుతుందన్నారు.

లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని భారత విదేశాంగ సహాయమంత్రి ఆనంద్‌ శర్మ అన్నారు. ఆ ఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో భారత క్రికెట్‌ జట్టును పాకిస్థాన్‌ పంపించలేదని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఏస్థాయిలో పేరుకుపోయారో ఈ సంఘటన తెలపుతుందని ఆయన అన్నారు. పాక్‌ ప్రభుత్వం మేల్కోని ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని ఆనంద్‌శర్మ సలహా ఇచ్చారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs