రోబో బుద్ధిజీవి నవలకు కాపీ
రోబో చిత్రంలో హీరో తనలానే ఉండే మరో రోబోను తయారు చేయటం, తయారైన రోబో తనను తయారూ చేసిన సైంటిస్టుని తండ్రిగా భావించటం, సైంటిస్టు రోబోను నాశనం చేస్తే తనంత తానే జీవం పోసుకోవటం, తనంత తానే బ్యాటరీ రీచార్జీ చేసుకోవటం వంటివే కాకుండా టీ, ఫలహారాలు అందించే ఆర్-2 రోబో చిత్రంలో ఉండగా, నవలలో కె-2 రోబో ఉంటుందని చెప్పారు. రోబో చిత్రం చివరలో ఏ జాయింట్ కు ఆ జాయింట్ తీసుకోవటం నవలలో కూడా ఉందని చెప్పారు. నవలలో మాదిరే చిత్రంలో కూడా రోబో సొంతగా ఆలోచించి మనిషి మాట వినకపోతే ఏమవుతుందనేది చిత్రంలోనూ, నా నవలలోనూ చివరగా ప్రశ్న ఉదయిస్తుందని ఆయన చెప్పారు.
తను బుద్దిజీవి నవలను 25 ఏళ్ల క్రితం 1984లో రాశానని, అప్పుడు ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా ప్రచురితమయిందని గుర్తు చేశారు. వైజ్ఞానిక నవలల పోటీలో బహుమతి కూడా వచ్చిందని ఆయన చెప్పారు. అయితే తన లీగల్ నోటీసు ప్రతిని రజినీకాంత్ కు పరీశీలన కోసం పంపించానని చెప్పారు. అయితే తాను రోబో విడుదలయిన ఇన్నాళ్లకు స్పందించడానికి కారణం - అనవసరంగా వివాదాన్ని సృష్టించవద్దని ఒకటికి రెండుసార్లు రోబో చిత్రాన్ని చూసి, చూసిన స్నేహితుల ద్వారా తెలుసుకొని ఇప్పుడు లీగల్ నోటీసులు పంపానని మైనంపాటి అంటున్నారు. అయితే తన బుద్ధిజీవి చిత్రాన్ని రోబోగా మలచటంలో శంకర్ కృతకృత్తులయ్యారని, రజినీకాంత్ భాగా చేశారని మెచ్చుకున్నారు. వివాదం మాట పక్కనబెడితే చిత్రం బాగుందని కితాబునిచ్చారు.
తనకు సైన్స్ అంటే ఎక్కువ ఇష్టమని ఆయన చెప్పారు. రోబోల తయారీలో జపాన్ ముందున్నదని, తాను రోబోల గురించి, కంప్యూటర్ గురించి, గ్రహాంతర యానం గురించి అధ్యయనం చేస్తూ వచ్చానని, ఆ సమయంలో తాను బుద్ధిజీవి నవల రాశానని ఆయన చెప్పారు. కంప్యూటర్ కు, మనిషికి మధ్య పోటీ పెరిగిన నేపథ్యంలో తాను ఊహించినవి నిజాలుగా తేలుతున్నాయని, అప్పట్లో తన నవలను విఠలాచార్య సినిమా లాగా ఉందని అనుకుని ఉంటారని ఆయన అన్నారు. తన నవలలు దాదాపు 20 దాకా కాపీకి గురయ్యాయని, వివిధ రూపాల్లో అవి సినిమాలుగా రూపుదిద్దుకున్నాయని ఆయన చెప్పారు. ఆదిత్య 369 సినిమా కూడా తన నవల ఆధారంగానే వచ్చిందని, అయితే తనకు క్రెడిట్ దక్కలేదని ఆయన చెప్పారు.