'వాంటెడ్'కు 'జై బోలో తెలంగాణ' దెబ్బ
బుధవారం ఆ ఆందోళన తెలంగాణవ్యాప్తంగా చోటు చేసుకుంది. వాంటెడ్ సినిమా ప్రదర్శనలకు పలు చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. హైదరాబాదులోని నాచారాంలో వాంటెడ్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లాలో వాంటెడ్ సినిమాతో పాటు ఇతర సినిమాల ప్రదర్సన కూడా నిలిపేశారు. గోదావరిఖనిలో వాంటెడ్ సినిమా ప్రదర్సనను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఆదిలాబాద్లో గోల్కొండ స్కూల్ సినిమా రీళ్లను దగ్దం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో వాంటెడ్, గోల్కొండ సినిమాల రీళ్లను దహనం చేశారు. మెదక్ జిల్లా హుస్నాబాదులోనూ వాంటెడ్ సినిమా ప్రదర్సనను అడ్డుకున్నారు.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వాంటెడ్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. నిజామాబాదు జిల్లాలోనూ వాంటెడ్ సినిమా ప్రదర్సనకు ఆటంకాలు ఏర్పడ్డాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సెన్సార్ బోర్డు సభ్యుడు రాము ఇంటి ముందు తెలంగాణవాదులు ధర్నా చేశారు. జై బోలో తెలంగాణ సినిమాకు ఆటంకాలు కల్పిస్తే తాను రాజీనామా చేస్తానని రాము చెప్పారు. జై బోలో తెలంగాణ సినిమాకు ఇదే విధమైన ఆటంకాలు కల్పిస్తే సీమాంధ్ర హీరోల సినిమాల విషయంలో తాము కూడా అదే రీతిలో వ్యవహరించాల్సి ఉంటుందని సెన్సార్ బోర్డు మరో సభ్యుడు దశరథరామిరెడ్డి మంగళవారం అన్నారు.
జై బోలో తెలంగాణ సినిమాకు సంబంధించి అభ్యంతరాలేవీ చెప్పకుండా దాన్ని జాతీయ సెన్సార్ బోర్డుకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు పంపింది. జాతీయ సెన్సార్ బోర్డు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత ప్రాంతీయ సెన్సార్ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. దీంతో ఈ నెల 28వ తేదీన విడుదల కావాల్సిన జై బోలో తెలంగాణ సినిమాకు ఆటంకాలు ఏర్పడ్దాయి. విడుదలలో జాప్యం జరుగుతోంది.