మౌనమేల?: టార్గెట్ చిరు ఫ్యామిలీ, వైయస్... (పిక్చర్స్)
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలంటూ రాయలసీమ, ఆంధ్ర జిల్లాల్లో ఎనిమిది రోజులుగా ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమంలో ప్రధానంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు నటించిన సినిమాలు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిలు టార్గెట్గా మారారు.
సమైక్య ఉద్యమం రాజకీయంగా, రాజకీయాలకు అతీతంగా కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు విపక్ష నేతలను విభజనకు టార్గెట్ చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉన్న వారు అందర్నీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే తమ పార్టీ నేతలను విమర్శించడాన్ని ఆయా పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. విభజన పాపం చిరుదేనని టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, సమైక్య జెఏసిలు మండిపడుతున్నాయి.
చంద్రబాబుదేనని కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఆరోపిస్తుండగా... టిడిపి, కాంగ్రెసులు వైయస్ పైన మండిపడుతున్నాయి. ఆయననే పద్నాలుగేళ్ల క్రితం రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను తెర పైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలను కూడా సమైక్యవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.
చిరంజీవి
సమైక్య ఉద్యమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రధానంగా టార్గెట్ అయ్యారు. చిరంజీవి రాజీనామా చేయాలంటూ సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. తాము ఇక్కడ సమైక్య రాష్ట్రం కోసం ఆందోళన చేస్తుంటే చిరు మాత్రం మౌనం వహించడం సరికాదని రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలంటూన్నారు.
ఎవడు
సమైక్యవాదులు మొదట లక్ష్యంగా మార్చుకున్నది రామ్ చరణ్ తేజ ఎవడు సినిమానే. చిరు రాజీనామా చేయకుండే ఎవడును అడ్డుకుంటామని హెచ్చరించారు... హెచ్చరిస్తున్నారు. చిరంజీవి రాజీనామా చేసేందుకు ఈ నెల 21వ తేది వరకు అభిమానులు డెడ్ లైన్ విధించారు. ఆ లోగా రాజీనామా చేయకుంటే ఆయన పుట్టిన రోజు వేడుకలను కూడా జరపమని హెచ్చరించారు.
అత్తారింటికి దారేది
చిరంజీవి రాజీనామా చేయకుంటే ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను అడ్డుకుంటామని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది రెండుసార్లు వాయిదా పడ్డట్లుగా కనిపిస్తోంది. అయితే సమైక్యవాదులకు బెదరడం కాకుండా కలెక్షన్స్ భయంతోనే వారు తగ్గినట్లుగా చెబుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి
విభజనపై ప్రకటన నేపథ్యంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తున్నాయి. 1999లో తెలంగాణ తుట్టెను కదిపింది వైయస్సేనని కాబట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి విమర్శించే అర్హత లేదంటున్నారు.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో హైదరాబాదు పైన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో తెలంగాణవాదులు ఆమెపై మండిపడుతున్నారు. సీమాంధ్రలో పట్టు కోసమే వారు ఇలా చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.
సోనియా గాంధీ
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్ర లేకుండా విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయాన్ని తీసుకోదని, ఆమే ప్రధాన బాధ్యురాలని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఆమె దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజనపై మౌనం దాల్చారు. కాంగ్రెసు పార్టీ ప్రకటన తర్వాత ఆయన దానిని స్వాగతించారు. అయితే ఉద్యమం ఊపందుకున్న తర్వాత మౌనం వహించారు. బాబు సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనపై పార్టీ ప్రకటన వచ్చినప్పటి నుండి దాదాపుగా క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. విభజన ప్రక్రియను తన చేతులమీదుగా జరిపించేందుకు ఆయన సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతున్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి ఆయనపై మండిపడుతోంది.
కెసిఆర్
విభజన పాపం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుదేనని, రాజకీయ నిరుద్యోగిగా మారిన ఆయన తన రాజకీయావసరాల కోసం పార్టీని స్థాపించి, ప్రత్యేక ఉద్యమం చేపట్టారంటూ సమైక్యవాదులు ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు.
నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 11వ తేదిన రాష్ట్రానికి రానున్నారు. బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మోడికి షాక్ ఇచ్చే ఉద్దేశ్యంలో భాగంగానే కాంగ్రెసు విభజన నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సమైక్యవాదులు బిజెపి ప్రత్యేక వాదంపై మండిపడుతున్నారు. పార్టీ కార్యాలయాల పైన దాడులు కూడా జరిగాయి. మోడీ సభను అడ్డుకోవాలని కాంగ్రెసు నేతలు సమైక్యవాదులకు పిలుపునిచ్చారు.
విగ్రహాలు
విభజనకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొందరు సమైక్యవాదులు దివంగత ప్రధానులు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. కొన్ని చోట్ల విగ్రహాలకు నిప్పు పెట్టారు.