మెదక్పై అమిత్ షా: పవన్ కళ్యాణ్తో మచ్చిక
హైదరాబాద్: లోకసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న ఘనత అమిత్ షాకు వెళ్లింది. అటువంటి వ్యూహాన్నే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రయోగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దానికితోడు, మెదక్ ఉప ఎన్నికల్లో తెరాసకు షాక్ ఇచ్చేందుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు.
ఇందులో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్కు వస్తున్నారు. 22వ తేదీ వరకూ దాదాపు 30 గంటల పాటు నిరంతరం ఆయన పార్టీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు, జిల్లాల అధ్యక్షులు, పదాధికారులు, గ్రామ అధ్యక్షులతో ప్రత్యక్షంగా మాట్లాడతారు.
మధ్యలో రాష్ట్రానికి చెందిన పలువురు సినీనటులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను కలుసుకుంటారు. ఇతర పార్టీలకు చెందిన కొంత మంది ప్రముఖులను ఆయన సమక్షంలోనే పార్టీలో చేర్చుకుంటారు. మొత్తంమీద జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత అమిత్షా తన పర్యటనను పార్టీని బలోపేతం చేయడానికి వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్టీ నేతలను కూడా ఆయన కలుసుకుంటారు.
ఈ నెలాఖరులో కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కూడా ఆయన పర్యటిస్తారు. జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత యుపి, హర్యానా పర్యటనలను విజయవంతంగా పూర్తి చేసుకున్న అమిత్షా దక్షిణాదిలోనూ యుపి తరహా ప్రయోగం చేసి పార్టీని పటిష్టం చేసే వ్యూహంతో అడుగుపెడుతున్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ప్రత్యామ్నాయంగా బిజెపిని రూపుదిద్దడంతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో బిజెపి విజయం సాధించేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు ఆయన ఈ పర్యటనను ఖరారు చేశారు.
మెదక్ ఎంపి స్థానంలో బిజెపి అభ్యర్ధిని గెలిపించేందుకు ఆ నియోజకవర్గం పరిధిలోని పలువురు సీనియర్ నాయకులను బిజెపిలో చేర్చుకుని వారిని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా నియమిస్తారు. తద్వారా మెదక్ ఎంపి సీటును కైవసం చేసుకుని తెరాసకు షాక్ ఇవ్వాలనే యోచనలో బిజెపి నేతలు ఉన్నారు. తర్వాత దశలో జిహెచ్ఎంసి ఎన్నికలను ఎదుర్కోవడంపై కూడా నేటి నుండే కార్యక్రమాన్ని రూపొందిస్తారు.
21వ తేదీ మధ్యాహ్నం ఆయన ఇంపీరియల్ గార్డెన్స్లో హైదరాబాద్ నగర బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 22వ తేదీన సరూర్నగర్ స్టేడియంలో జరిగే తెలంగాణ జిల్లాల గ్రామాధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు. ఈ రెండు రోజులూ ఆయన బేగంపేటలోని టూరిస్టు ప్లాజాలో బస చేస్తారు. ఈ సందర్భంగా ఆయన పలువురు పత్రికా సంపాదకులను సైతం కలుసుకుంటారని బిజెపి నేతలు చెబుతున్నారు.
ప్రధానంగా పవన్కళ్యాణ్ సేవలను రానున్న రోజుల్లో పార్టీ వినియోగించుకోవడంపై కూడా చర్చిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల తర్వాత తనను పట్టించుకోలేదని గరంగరంగా ఉన్న పవన్ను శాంతపరిచే కార్యక్రమం కూడా చేపడతారని తెలిసింది. ఈ సందర్భంగా పార్టీకి చెందిన సీనియర్ నేతలు వి రామారావు, ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, పదాధికారులతో కూడా షా చర్చలు జరుపుతారు.