సగం సగం!: సెక్రటరియేట్లో కంచె, 2 రాష్ట్రాల పాలన
హైదరాబాద్: రాష్ట్ర విభజన.. పదేళ్లపాటు కొత్త ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పరిపాలన హైదరాబాదు నుండే నిర్వహించాల్సి ఉన్నందున సచివాలయ విభజనకు రంగం సిద్ధమవుతోంది. పరిపాలన కోసం అన్నింటా ఇరు ప్రాంతాలకు విభజన చేయనున్నారు. సచివాలయం మధ్యలో ఇనుప కంచె వేయనున్నారు. మింట్ కంపౌండ్ వైపు మరో ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. సిఎం ప్రస్తుత కార్యాలయం తెలంగాణకు ఉండనుంది. రెండు రాష్ట్రాల కోసం మూడు ప్రతిపాదనలు చేశారు.
శాసన సభలోను వేర్వేరు ఏర్పాట్లు చేయనున్నారు. జూబ్లీహాలులో రెండో మండలి ఉండనుంది. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు యథాతథంగా ఉండనున్నాయి. దిల్ కుశ అతిథిగృహంలో గవర్నర్ అదనపు సచివాలయం ఉండనుంది. విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు అదనపు భవనాలు కేటాయించేందుకు స్థలపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఇప్పుడు ఉన్న భవనంలోనే రెండు రాష్ట్రాల కార్యాలయాలకు వసతి కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
దీంతో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ భవనాల కేటాయింపుపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు, ఇతర అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ శాఖలకు, మంత్రులకు, శాసనసభ్యులకు, అధికారులకు సమకూర్చాల్సిన వసతికి సంబంధించి త్వరగా ఏర్పాట్లు పూర్తిచేయాలని గవర్నర్ ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలను ఇకపై రెండుగా విభజించాల్సి ఉంటుంది. కొంతకాలం రెండు రాష్ట్రాల కార్యాలయాలు ఇక్కడే ఉంటున్నందున వాటికి విడివిడిగా వసతి సమకూర్చాల్సి ఉన్నప్పటికీ అదనపు భవనాలు అందుబాటులో లేకపోవడంతో ఉన్న భవనంలోనే రెండు రాష్ట్రాల కార్యాలయాలకు కొన్ని అంతస్తులను కేటాయించాలని నిర్ణయించారు.
అది కూడా అన్ని విభజన అంశాల్లో అమలు చేస్తున్న 58-42 నిష్పత్తి మేరకే గదుల పంపకాలు చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న మంత్రుల వసతి సముదాయంలోని భవనాలనే ఇరు ప్రాంతాల మంత్రులకు సమకూర్చాలని భావిస్తున్నారు. ఉమ్మడి భద్రతా వ్యవస్థ నడుమ ఇరు ప్రాంతాల మంత్రులు ఒకే చోట ఉండేలా చూడాలని భావిస్తున్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించి ఉన్న పాత, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్లోని గదులనే రెండు ప్రాంతాల సభ్యులకు కేటాయించనున్నారు. ఏ ప్రాంతం వారికి ఎన్ని గదులు కేటాయిస్తామన్నది గవర్నర్ నిర్ణయిస్తారని, వ్యక్తిగతంగా వసతి కేటాయింపులను ఆయా రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు ఖరారు చేస్తారని ఓ అధికారి వెల్లడించారు.
అత్యంత కీలకమైన కొత్త సచివాలయం ఏర్పాటుపై కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి గవర్నర్కు సమర్పించారు. ఇప్పుడున్న సచివాలయంలోనే కొన్ని బ్లాకులను కొత్త రాష్ట్ర సచివాలయానికి కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులోనే కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ఏ బ్లాకును ముఖ్యమంత్రి కార్యాలయానికి కేటాయించాలని, సిఎస్ కార్యాలయం, క్యాబినెట్ సమావేశ మందిరం, ఇతర సమావేశ మందిరాలు, సిఎం పేషీ అధికారులకు ఛాంబర్ల కేటాయింపు వంటి సౌకర్యాలకు అనుకూలంగా ఉన్న బ్లాక్ను గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
భద్రతకు అవకాశాలు ఉన్న బ్లాక్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. కొత్తగా మరో గేటును ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఆ కొత్త గేటు మింట్ కంపౌండు వైపు ఉండనుంది. వాస్తవంగా సచివాలయానికి పాత గేటు ఒకటి ఉన్నప్పటికీ అది వాస్తుకు అనుకూలంగా లేదన్న భావనతో తరువాత కొత్త గేటును ఏర్పాటు చేశారు. దీంతో కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం మరో గేటును వాస్తు మేరకు నిర్మించాల్సి ఉంటుంది. కాగా, ఈ ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ వారం రోజుల్లో తుది ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.