బాబుకు రిలీఫ్: ఎట్టకేలకు సచివాలయంలోకి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయదశమి పర్వదినాన సచివాలయం ఎల్ బ్లాక్లోని తన నూతన కార్యాలయంలో అడుగుపెట్టనున్నారు. ఎట్టకేలకు సచివాలయంలోని ఆయన కార్యాలయం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయ సిబ్బంది, నిఘా విభాగం అధికారులు బుధవారం ఎల్ బ్లాక్లోని భద్రతా పరమైన ఏర్పాట్లును పరిశీలించారు. 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సీఎం తన కార్యాలయంలో లాంఛనంగా అడుగుపెడతారని సచివాలయ ఉద్యోగుల సంఘ నేత మురళీకృష్ణ చెప్పారు.
రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై ఇప్పటివరకూ ఎంతో టెన్షన్ పడ్డానని, ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉందని చంద్రబాబు అన్నారు. రుణమాఫీ ఎలా చేయాలనే విషయంపై నిత్యం ఆలోచన సాగిందని ఆయన అన్నారు. ఈ సమయంలో తనకొచ్చిన ఆలోచనలన్నీ కలిపి ఎంతో కసరత్తు చేశానని ఆయన తెలిపారు. ఇన్ని కష్టాల్లోనూ, ఇప్పుడైనా భగవంతుడు సరైన దారి చూపించాడన్నారు.
దాదాపు మూడు నెలల పాటు రుణమాఫీపై కసరత్తు చేశామన్న ఆయన ఆర్బీఐ, కేంద్రం సహాయ నిరాకరణ వంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు ఇచ్చిన వాగ్ధానాన్ని ఎలాగైనా అమలు చేసి వారి జీవన విధానాన్ని కాస్తయినా మెరుగు పరచాలని నిర్ణయింకున్నానని ఆయన చెప్పారు. రుణామఫీని ప్రభుత్వమే వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామంటే ఆర్బీఐ గవర్నర్ సహకరించలేదన్నారు.
ఎన్నో రకాలుగా ఆలోచించి కసరత్తు చేస్తే రైతు సాధికారత సంస్థ యోచన తట్టిందన్నారు. రుణ మాఫీకి ఇదో చక్కటి మార్గాన్ని చూపిందన్నారు. వాస్కోడిగామా భారత్కు వచ్చినట్టు తామూ రుణమాఫీకి ఓ దారి కనుగొన్నామని చెప్పారు. ఇంత కసరత్తు చేసిన తర్వాతనే ఆర్బీఐ , బ్యాంకులు తమతో ఒప్పందానికి వచ్చాయన్నారు. బ్యాంకులు ఒప్పుకోవడంతో ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉందని ఆయన చెప్పారు.