మెట్రో రైలు: ఎపి వర్సెస్ టీ, రంగంలోకి కేంద్రం
హైదరాబాద్: తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మధ్య హైదరాబాద్ మెట్రో రైల్ యుద్ధం ముదురుతోంది. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వైరంగా కూడా మారే దిశగా పయనిస్తోంది. ఈరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజధాని హైదరాబాద్లో మెట్రో రైల్ నిర్మాణ పనులు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరితో ఎల్అండ్టి సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడిందని టిడిపి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూమిని అప్పగించే అంశంతో పాటు ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతుండటంతో తాము ఈ ప్రాజెక్టును కొనసాగించలేమని ఈనెల 17న మెట్రో రైల్ సంస్థ సీఈవో గాడ్గిల్ ప్రభుత్వానికి రాసిన లేఖ మీడియాలో ప్రముఖంగా వచ్చింది దుమారం లేపింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో దీనిపై గాడ్గిల్ సీఎం కెసిఆర్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశం కావడం, ప్రభుత్వ సహకారంతోనే ముందుకు వెళ్లి ప్రాజెక్టును పూర్తి చేస్తానని ప్రకటించడం అదే రోజు వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే స్థితికి చేరుకుంది.
మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శంకర్ మెట్రో పనుల పురోగతిని సమీక్షించడానికి నగరానికి రానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమై ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వివరాలు సేకరించనున్నారు. గాడ్గిల్ ప్రభుత్వానికి రాసిన లేఖ మీడియాకు లీక్ కావడంతో సీఎం కెసిఆర్ ఆగ్రహించి మెట్రో రైల్ నిర్మాణ బాధ్యతల నుంచి ఎల్అండ్టి సంస్థ వైదొలిగితే ప్రభుత్వమే సొంతంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని స్పష్టం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో మెట్రో పనుల నిమిత్తం ఎల్అండ్టి సంస్థకు అప్పగించిన భూముల విషయంపై తెలంగాణ ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నదని టిడిపి ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఆరోపించడంతో టిడిపి, టిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రతను మరింతంగా పెంచింది. మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మాణ సంస్థకు అప్పగిస్తామని హామీ ఇచ్చిన గేమింగ్ సిటీ భూములను టిఆర్ఎస్ ప్రభుత్వం మై హోం గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావుకు అక్రమంగా కట్టబెట్టిందని ఆరోపణలు గుప్పించారు. ఆ విషయాన్ని తట్టుకోలేకనే అప్పటి ఏపిఐఐసి ఎండీ రంజన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో నేరుగా సీఎం కెసిఆర్, ఆయన కుమారుడు ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించడంతో ఈ మొత్తం వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. మెట్రో రైల్పై టిడిపి, ఆ పార్టీ నేత రేవంత్రెడ్డి చేస్తున్న విమర్శలను ఆధారాలు లేని ఆరోపణలుగా ప్రభుత్వం కొట్టిపడేసింది. రేవంత్ రెడ్డి ఆరోపణలపై తెరాస నాయకుడు జూపల్లి కృష్ణారావుతో సహా తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు.
చంద్రబాబు మాట్లాడాలనుకునే మాటలను ఆయన తన చెంచాలతో మాట్లాడిస్తున్నారని నాయని నర్సింహారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాదు మెట్రో రైలుపై తనను అనవసరంగా లాగుతున్నారని చంద్రబాబు నాయుడు చెప్పినా తెరాస నాయకులు ఆ దిశగా విమర్శలు చేయడం మానలేదు. టిడిపి నేతలు ఆరోపించినట్లుగా మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టికి కేటాయించిన భూములను ఎవరికీ బదలాయించలేదని టీఎస్ఐఐసి స్పష్టం చేసింది. ఈమేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆ సంస్థ ఎండి వెంకటనర్సింహ్మారెడ్డి ప్రకటన చేసినట్లు పలువురు భావిస్తున్నారు.
ఈనెల 23న ఈ మొత్తం వ్యవహారంపై సమీక్ష నిర్వహించనున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ఆధారంగా అసలు ప్రాజెక్టును ఎల్అండ్టి నిర్వహిస్తుందా ? లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా ? లేక కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళుతుందా ? అనేది తేలుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.