నారా లోకేష్ ఫెయిల్: తెరాసలోకి తుమ్మల
టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల మంత్రివర్గాల్లో పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్ళూ మంత్రిగా ఉన్నారు. ఖమ్మం జిల్లా టిడిపిలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న విభేదాలు తుమ్మల నిష్క్రమణకు దారితీసినట్లు కనిపిస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో ఆయనకు చాలాకాలంగా సరిపడటం లేదు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పాలేరుకు మారాలనుకొన్నారు. కానీ, నామా ఒప్పుకోలేదు. ఆయన ఒత్తిడితో తుమ్మలను ఖమ్మంలోనే కొనసాగించారు. చివరకు నామా, తుమ్మల ఇద్దరూ ఓడిపోయారు. జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తుమ్మల సూచించిన మహిళను ఎంపిక చేశారు. ఈ దశలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రంగప్రవేశం చేశారు. తుమ్మలకు నచ్చజెప్పి తన పార్టీలోకి రావడానికి అంగీకరింపజేశారు.
ఆయనకు మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో తుమ్మల టీఆర్ఎస్లో చేరికకు మార్గం సుగమమైంది. ఆయనతోపాటు జడ్పీ చైౖర్పర్సన్ కవిత, జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో అనుయాయులు కూడా చేరుతారని సమాచారం.
టీఆర్ఎస్ నాయకత్వం, మరికొందరు టిడిపి ఎమ్మెల్యేలపైనా వల విసిరినట్లు చెబుతున్నారు. వారిపై టీఆర్ఎస్ నాయకులు పదేపదే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమ పార్టీ బలహీనంగా ఉండటంతో అక్కడి ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ నాయకత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వీరితో పాటు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోసం రాయబారాలు నడుపుతున్నారు. కాగా, వైరా వైసీపీ ఎమ్మెల్యే మదన్లాల్ మంగళవారం కేసీఆర్ను కలిశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలూ పార్టీలోకి వస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
టీడీపీలోనే ఉంటా: సండ్ర
టిడిపిని వీడేది లేదని, కార్యకర్తల అభిప్రాయం మేరకు తాను పార్టీలోనే కొనసాగుతానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.