అధికారానికి చంద్రబాబు ఉవ్విళ్లు: 30 చోట్ల సెగ
హైదరాబాద్: సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ముఖ్యమంత్రి పీఠం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, అసంతృప్తుల బెడద ఆయన లక్ష్యానికి విఘాతం కలిగిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లు లభించక అసంతృప్తికి గురైన నాయకులు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తారా, లేదా అనేది ప్రశ్నగా మారింది.
రాష్ర్ట విభజన నేపథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 45 మంది మాజీ మంత్రలు, సిట్టింగ్ శాసనసభ్యులు, ఇతరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందిరకీ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ల హామీలిచ్చి తమ పార్టీ కండువాలను కప్పారు. సీమాంధ్రలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టిక్కెట్లపై హామీతో పలువురు కాంగ్రెస్ వారు చేరారు. అయితే, టిక్కెట్ల పంపిణీ వద్దకు వచ్చే సరికి చంద్రబాబు కాంగ్రెస్ నుండి వచ్చిన అందరికీ టిక్కెట్లను ఇవ్వలేక పోయారు.
కాంగ్రెస్ నుండి వచ్చిన వారిలో అసెంబ్లీ, పార్లమెంట్ కలిపి చంద్రబాబు 35 మందికి టిక్కెట్లను ఇవ్వగలిగారు. అంటే ఆ మేరకు పార్టీలో గడచిన పదేళ్లుగా కష్టపడిన వారికి టిక్కెట్లు లభించలేదు. వీరంతా చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, పార్టీలోనే ఉన్న మరో పది మంది సిట్టింగ్ శాసనసభ్యులకు తిరిగి టిక్కెట్లు ఇవ్వటినికి చంద్రబాబు నిరాకరించటంతో నేతల్లోని అసంతృప్తి తారాస్ధాయికి చేరకుంది. దీని ప్రభావం అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు సమయంలో బయటపడింది.
పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 13 శాసనసభా టిక్కెట్లను కేటాయించటమే ఇష్టం లేని నేతలు, కాంగ్రెస్ వలస పక్షుల వల్ల తమ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన వారికి తోడు తిరిగి పోటీ చేసే అవకాశాన్ని కోల్సోయిన మ రో 10 సిట్టింగ్ శాసనసభ్యులు తోడయ్యారు. దీంతో సుమారు 30 నియోజకవర్గాల్లో పార్టీ అధికారిక అభ్యర్ధులకు తోడు తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ తిరుగుబాటు అభ్యర్ధులను బుజ్జగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నట్లు కనబటం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి.
అనంతపురం లోక్సభ, తాడిపత్రి శాసనసభకు కాంగ్రెస్ వలసపక్షులైన జెసి దివాకర్రెడ్డి, జెసి ప్రభాకర్రెడ్డిలకు టిక్కెట్లు లభించాయి. అదే జిల్లాలోని హిందుపురం శాసనసభకు సిట్టింగ్ ఎంఎల్ఏ అబ్దుల్ఘనిని కాదని తన బావమరిది నందమూరి బాలకృష్ణకు చంద్రబాబు టిక్కెట్టు కేటాయించారు. రాయదుర్గంలో స్దానిక అభ్యర్ది దీపక్రెడ్డిని కాదని మాజీ ఎంపి కాల్వ శ్రీనివాసులుకు టిక్కెట్లు ఇచ్చారు. కర్నూల్ జిల్లాలో సీనియర్ నేత కెఈ ప్రభాకర్కు టిక్కెట్టు ఇవ్వక కొత్త ముఖం బిటి నాయుడికి టిక్కెట్టు ఇవ్వటంతో ప్రభాకర్ కర్నూల్ లోక్సభకు స్వతంత్ర అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు.
కడప జిల్లాలో ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎంఎల్ఏ ఎం. లింగారెడ్డిని కాదని వరదరాజులరెడ్డికి టిక్కెట్టు ఇవ్వటంతో లింగారెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ హేమలతకు టిక్కెట్టు నిరాకరించి కొత్త వ్యక్తికి ఇవ్వటంతో ఆమె తిరుగుబాటు అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ బల్లి దుర్గాప్రసాద్రావుకు టిక్కెట్ నిరాకరించటంతో ఆయన పోటీ అభ్యర్దిగా నామినేషన్ వేశారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి వచ్చిన శాసనసభ్యుడు అన్నె రాంబాబుకు టిక్కెట్టు ఇవ్వటంతో పార్టీలో టిక్కెట్లు ఆశించిన నేతలు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ దాసరి బాలవర్ధనరావును కాదని అవనిగడ్డకు చెందిన వల్లభనేని వంశీకి టిక్కెట్టు ఇవ్వటంతో దాసరి పోటీ అభ్యర్దిగా నిలిచారు. అవనిగడ్దలో పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ నుండి వచ్చిన మండలి బుద్దప్రసాద్కు ఇచ్చారు.
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో పార్టీలో ఎప్పటి నుండో కష్టపడుతున్న నేతను కాదని స్ధానికేతరుడైన తులసీ రామచంద్రప్రభుకు టిక్కుట్టు ఇచ్చారు. దాంతో నియోజకవర్గం వ్యాప్తంగా అసంతృప్తి సెగలు లేవగా వెంటనే రామచంద్రప్రభుకు టిక్కెట్టు రద్దు చేశారు. అయితే, ఎప్పటి నుండో కష్ట పడుతున్న నేతకు కాదని చిరంజీవి అనే వ్యక్తికి టిక్కెట్టు కేటాయించటంతో అభ్యర్దిని గదిలోపెట్టి తాళం వేశారు. చివరి నిముషంలో పోలీసుల జోక్యంతో అభ్యర్ది నామినేషన్ వేయగలిగారు.
గోదావరి జిల్లాలోని కొవ్వూరు సిట్టింగ్ ఎంఎల్ఏ టి.వి.రామారావును కాదని కొత్త వ్యక్తికి టిక్కెట్టు ఇవ్వగా రామారావు తిరుగుబాటు అభ్యర్దిగా పోటీలో ఉన్నారు. ఏ రకంగా చూసినా ఈ ఎన్నిక అటు చంద్రబాబుకు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా తెలుగుదేశంకు కూడా ఎంతో కీలకం. అటువంటిది టిడిపి పోటీ చేస్తున్న 162 నియోజకవర్గాల్లో సుమారు30 నియోజకవర్గాల్లో అసంతృప్తుల సమస్య చాలా తీవ్రంగా ఉందని పార్టీ నేతలే అంటున్నారు. ఈ అసంతృప్తులు చంద్రబాబు అశలపై నీళ్లు చల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.