చంద్రబాబు ఆలోచన: బిజెపితో పొత్తుకు కటీఫ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తుకు స్వస్తి చెప్పే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ పెత్తనం చేస్తోందనే పేరు మీద ఆయన బిజెపితో పొత్తును తెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపికి కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో ప్రత్యర్థి పార్టీ విజయం సాధిస్తుందని, దానివల్ల నష్టం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు.
గతంలో 1998 నుంచి 2004 సంవత్సరం వరకూ తెలుగుదేశం, బిజెపి కలిసి నడిచాయి. ఆ కాలంలో తమ రాజకీయ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ తెర ముందు కనిపించేది కాదని, ఈసారి మరీ బహిరంగంగా అన్ని విషయాల్లో సంఘ్ జోక్యం పెరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం జరిగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో ఆర్ఎస్ఎస్ నేతలు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఏ సీట్లు బిజెపి తీసుకోవాలో కూడా వారే నిర్ణయించారని, బిజెపి తీసుకొన్న సీట్లలో అభ్యర్థుల ఎంపికలో కూడా వారే ప్రధాన పాత్ర పోషించారని, ఇది తమకు ఇబ్బందిగా ఉందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ జోక్యం కారణంగా పొత్తు కొనసాగడం సాధ్యం కాదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
కొన్ని చోట్ల బిజెపికి ఇచ్చిన సీట్ల వల్ల లోక్సభ అభ్యర్థులకు సమస్యలు ఎదురు అవుతుండటంతో వాటిని మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు. కానీ, బీజేపీ నేతలు ససేమిరా అన్నారు. విశాఖ పార్లమెంటు స్థానంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును నిలపాలని ఆయనను పార్టీలోకి చేర్చుకున్నారు. అదే సీటును బిజెపి నేతలు పట్టుబట్టి తీసుకున్నారు. ఆ సీటు బిజెపికి వెళ్లినట్లు తెలియగానే అక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఎస్ విజయలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆమెపై బిజెపి నిలబెడుతున్న అభ్యర్థి బలం సరిపోదని వాదిస్తున్నారు.
నర్సాపురం లోక్సభ స్థానంలో గత కొంతకాలంగా బిజెపి తరపున రఘురామరాజు పని చేసుకొంటున్నారు. అయితే ఆయనను కాదని మరో అభ్యర్థిని బిజెపి ప్రకటించింది. దీంతో నర్సాపురం స్థానంలో పోరు బలహీన పడిందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. శ్రీకాకుళం లోక్సభ అభ్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత కింజారపు రామ్మోహననాయుడు తమ జిల్లాలో బిజెపి ఉనికి నామాత్రమేనని, అక్కడ అసెంబ్లీ సీటు తీసుకొంటే తాను దెబ్బ తింటానని అనేకసార్లు ఆ పార్టీ నేతలను కోరారు. కానీ, బీజేపీ నేతలు పట్టుబట్టి ఇచ్ఛాపురం సీటు తీసుకొన్నారు.
గుంటూరు జిల్లాలో నర్సరావుపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, కడప జిల్లాలో కడప, అనంతపురం జిల్లాలో అనంతపురం, కర్నూలు జిల్లాలో కోడుమూరు, నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ స్థానాలపై కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఇలాంటి వాదనలే ముందుకు తెచ్చారు. కానీ బిజెపి నేతలు పట్టించుకోలేదు. నర్సాపురం టిక్కెట్టు పొందిన గోకరాజు గంగరాజు బీజేపీలో కేవలం వారం క్రితమే చేరారు. ముందురోజు కాంగ్రెస్ జాబితాలో ఉన్న అభ్యర్థిని తీసుకొని మర్నాడు విజయవాడ పశ్చిమలో బీజేపీ టికెట్ ఇచ్చారు. ఈ కారణాలను చూపి చంద్రబాబు సీమాంధ్రలో బిజెపితో తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచలనలో ఉన్నట్లు చెబుతున్నారు.