నటి శ్వేతాబసు అరెస్టు: టార్గెట్ ఎవరు, వెనక ఎవరు?
హైదరాబాద్: సినీ నటి శ్వేతాబసు పోలీసుల వలలో పడడం ఇదే మొదటిసారి కాదని సమాచారం. వ్యభిచారం చేస్తూ ఆమె టాస్క్ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. గతంలో ఒక టీవీ చానల్ నిర్వహించిన ఆపరేషన్లో తన గుట్టును తానే బయటపెట్టుకుంది. ఇది కాకుండా మరోసారి దొరికిపోయినప్పటికీ అప్పుడు పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారని అంటూ మంగళవారం మీడియాలో కథనాలు వచ్చాయి.
శ్వేతాబసును అరెస్టు చేయడానికి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించామని పోలీసులు అంటున్నారు. శ్వేతాబసు వ్యవహారంలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ వాదనను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. అయితే శ్వేతాబసు మాత్రం ఒక మొబైల్స్ కంపెనీ ప్రతినిధి చేతుల్లో బొమ్మ అని తెలుస్తోందంటూ మీడియా కథనాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఆపరేషన్లో అతడూ ఉన్నాడని సమాచారం.
పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ శ్వేతపైన చేశారా, లేకుంటే బ్రోకర్గా చెబుతున్న బాలుపైన చేశార అనే విషయంపై లేదని మీడియా వార్తాకథనాలు అంటున్నాయి. సినీ పరిశ్రమలో ఒక వర్గం శ్వేతాబసును టార్గెట్ చేసిందని తెలుస్తోంది. పరిశ్రమలో బ్రోకర్లకు కొదువలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా చెబుతున్న బాలు ఎవరిన్నదీ పూర్తి వివరాలు చెప్పడం లేదు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్కు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తే బాలుగా చలామణి అవుతున్నాడని చెబుతున్నారు.
వ్యాపారవేత్త విషయంలో మాత్రం పోలీసుశాఖ మొత్తం ఒకటే పలుకు పలుకుతోంది. శ్వేతాబసుతోపాటు ఆమెకు బ్రోకర్గా వ్యవహరించిన బాలును పోలీసులు ఎర్రమంజిల్ కోర్టులో సోమవారం హాజరుపరిచారు. ఈ విషయాన్నీ చాలా గోప్యంగా ఉంచారు. డెకాయ్ ఆపరేషన్లోనే శ్వేతను పట్టుకున్నప్పుడు అంత గోప్యత దేనికన్న ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పడం లేదని ఓ ప్రముఖ దినపత్రిక సందేహాన్ని వ్యక్తం చేసింది.
ఒక వ్యక్తిని తామే బాలుకు పరియం చేసి ఆపరేషన్ నిర్వహించామని టాస్క్ఫోర్స్లోని కొందరు చెబుతున్నారు. బాలు వద్దకు తామే కస్టమర్ల మాదిరిగా వెళ్లామని ఇంకొందరు చెబుతున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు ఎటువంటి దాడులు నిర్వహించినా ఎంతో కొంత నగదును స్వాధీనం చేసుకుంటారు. బాలుతో లక్ష రూపాయలకు డీల్ కుదరిందని చెబుతున్న శ్వేతాబసు వ్యవహారంలో అసలు డబ్బు విషయంపై పోలీసులు నోరు మెదపడం లేదని అంటున్నారు.