జాతీయపార్టీగా అవసరమా?: టీడీపీ డైలమా, కమిటీ
హైదరాబాద్: పార్టీని జాతీయ పార్టీగా చేయాల్సిన ఆవశ్యకత పైన చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని నియమించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. జాతీయ పార్టీగా చేయాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి తదితర అంశాల పైన అధ్యయనం చేసే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించనున్నారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించాలంటే నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించి ఉండాలని అనుకున్నారు.
ఏఐఏడీఎంకే లాంటి పార్టీలు జాతీయ పార్టీగా లేకున్నా.. తమిళనాడు, పాండిచ్చేరి రెండు రాష్ట్రాల్లోను ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. పార్టీని జాతీయ పార్టీగా మార్చకుండానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోను సైకిల్ గుర్తే పార్టీకి ఉందని, ఇలాంటి పరిస్థితులో అసలు జాతీయ పార్టీగా మారాల్సిన అవసరంపై చర్చించారని తెలుస్తోంది.
జాతీయ పార్టీగా మార్చాలా అనే అంశంపై ఓ కమిటీని వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రావుల చంద్రశేఖర రెడ్డిలు ఉండే అవకాశాలున్నాయి. జాతీయ పార్టీగా చేయదల్చుకుంటే రానున్న రోజుల్లో కనీసం ఐదారు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా జాతీయ పార్టీగా తెలుగుదేశం ఎదగాల్సి ఉందని, అది జరగాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయాలని పలువురు సూచించారు. వచ్చే మహానాడునే ముహూర్తంగా ఖరారు చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.